న్యూఢిల్లీ, మే 21:విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.912.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఆదాయం అధికంగా లభించడం వల్లనే లాభాల్లోకి వచ్చినట్టు పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,036.32 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.7,245.26 కోట్ల నుంచి రూ.8,181.72 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిర్వహణ ఖర్చులు రూ.8,644.28 కోట్ల నుంచి రూ.7,091.20 కోట్లకు తగ్గాయని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 40 పైసలు తుది డివిడెండ్ను షేరుహోల్డర్లకు పంచనున్నట్టు ప్రకటించింది.