హైదరాబాద్, ఆగస్టు 21: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. రూ.4 వేల కోట్ల విలువైన ఆర్డర్ను మహాన్ ఎనర్జీ నుంచి పొందింది. అదానీ పవర్కు సబ్సిడరీ సంస్థే ఈ మహాన్ ఎనర్జీ కావడం విశేషం. 35 నెలల్లో పూర్తికానున్న బంధురా పవర్ ప్రాజెక్టు కోసం భెల్ విద్యుత్ పరికరాలను 31 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఆర్డర్లలో భాగంగా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు, సూపర్విజన్ ఆఫ్ ఎరెక్షన్ పరికరాలను రెండు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వీటిలో బాయిలర్లు, టర్బైన్ జనరేటర్లను తిరుచి, హరిద్వార్ ప్లాంట్లో భెల్ తయారు చేయనున్నది. దీంతో భెల్ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. భారీ ఆర్డర్ రావడంతో కంపెనీ షేరు ధర 3.21 శాతం పెరిగి రూ.101.15 వద్ద ముగిసింది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేరు ధర 86 శాతం బలపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.35 వేల కోట్లకు చేరుకున్నది.