Bharatpe Fraud | ఇప్పుడు మనమంతా డిజిటల్ పేమెంట్స్ యుగంలో ఉన్నాం.. కరంట్ బిల్లు, ఫోన్ బిల్లు.. వాటర్ బిల్లు.. నెలవారీ రుణ వాయిదాలు.. బీమా ప్రీమియం ఒక్కటేమిటి అన్ని రకాల పేమెంట్స్ కూడా పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే.. ద్వారా చేసేస్తున్నాం.. వాటిల్లో ఒకటి భారత్ పే. అనూహ్యంగా దాని సహ వ్యవస్థాపకుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశ్నీర్ గ్రోవర్ కష్టాల్లో చిక్కుకున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. అశ్నీర్ గ్రోవర్ను కంపెనీ నుంచి టర్మినేట్ చేయాలని భారత్ పే బోర్డు నిర్ణయించిందని దీంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల కథనం. అశ్నీర్ గ్రోవర్ ఫైనాన్సియల్ ఫ్రాడ్కు పాల్పడ్డాడని సంస్థ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన సేవలను శాశ్వతంగా తొలగిస్తూ భారత్ పే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అంతే కాదు.. అశ్నీర్ గ్రోవర్ ఫైనాన్సియల్ ఫ్రాడ్పై సవివరంగా దర్యాప్తు చేసేందుకు లా ఫర్మ్, రిస్క్ అడ్వైజరీ కన్సల్టెంట్నూ కంపెనీ నియమించిందని సమాచారం. దీని పూర్తి నివేదిక రావడానికి రెండు నెలల సమయం పడుతుందని తెలియవచ్చింది.
అశ్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్తోపాటు 15 మంది ఉద్యోగులను కూడా ఈ వారంలో భారత్ పే ఇంటికి పంపించేసింది. సంస్థ ప్రారంభంలో మాధురి జైన్.. ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్ అండ్ హ్యుమన్ రీసోర్సెస్ విభాగాలకు అధిపతిగా వ్యవహరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాధురి జైన్.. భారత్పేలో చేరకముందు ఫ్యాషన్ బొటిక్యూ నడిపారు. అప్పట్లో క్వాలిఫైడ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్వో)ను నియమించడానికి కంపెనీ చేసిన ప్రయత్నాలను అశ్నీర్ గ్రోవర్ తిరగొట్టారని భారత్ పే సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఫ్యాషన్ యాప్ నైకా ఐపీవోలో షేర్ల కొనుగోలు ఫెయిల్యూర్ విషయమై కొటక్ వెల్త్ మేనేజ్మెంట్ ఉద్యోగిని బెదిరించిన ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అశ్నీర్ గ్రోవర్కు కష్టాలు మొదలయ్యాయి. మార్చి నెలాఖరు వరకు అశ్నీర్ను స్వచ్చందంగా సెలవుపై పంపుతూ బోర్డు ఈ నెల 19న నిర్ణయం తీసుకున్నది. సంస్థలో లావాదేవీలు, కొన్ని అంశాలపై దర్యాప్తునకే అశ్నీర్ను సెలవుపై పంపినట్లు తెలుస్తున్నది. కొన్ని రోజుల తర్వాత అశ్నీర్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.
భారత్పే ఉద్యోగులతో గానీ, ఇన్వెస్టర్లతో గానీ మాట్లాడవద్దని అశ్నీర్ గ్రోవర్ను భారత్పే బోర్డు ఆదేశించిందని తెలుస్తున్నది. కొటక్ వెల్త్ మేనేజ్మెంట్ ఉద్యోగితో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో క్లిప్ ఇప్పటికీ ఫేక్ అని భారత్పే సిబ్బందితో, కొలీగ్స్తో చెబుతున్నారు. అశ్నీర్, ఆయన భార్య మాధురి మరో ఐదుగురు కలిసి ఫైనాన్సియల్ ఫ్రాడ్కు పాల్పడ్డారన్న విషయమై దర్యాప్తు చేపట్టింది.
ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘించి రెండంకెల కోట్లలో నిధులు దారి మళ్లించారని భారత్ పే వర్గాల కథనం. గతేడాది భారీ మొత్తంలో రియాల్టీ ఆస్తులు కొనుగోలు చేశారని, వీటిపై ప్రశ్నిస్తున్నారని తెలియవచ్చింది. గతేడాది రూ. 20-30 కోట్ల పై చిలుకు విలువ గల రెండు ఇండ్లు కొనుగోలు చేశారు. ఈ ఇండ్లను ఆయన ఎలా కొన్నారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉందని సంస్థలో మరో వ్యక్తి చెప్పారు.