Bharat Pe | చిక్కుల్లో పడ్డ భారత్ పే సహ వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్.. శాశ్వతంగా సంస్థను వీడేందుకు తనకు సరిపడా పరిహారం చెల్లించాలని బోర్డును కోరినట్లు తెలుస్తున్నది. కానీ అశ్నీర్ డిమాండ్ను భారత్ పే బోర్డు అంగీకరించేందుకు సిద్ధంగా లేదని సమాచారం. ఈ వివాదం ఫిన్టెక్ స్టార్టప్ భారత్ పే బోర్డుకు, అశ్నీర్ గ్రోవర్కు మధ్య న్యాయపోరాటంగా మారే అవకాశాలు ఉన్నాయని సంస్థ సన్నిహిత వర్గాల కథనం. గత నెల 31నే తనకు సరిపడా పరిహారం చెల్లిస్తే భారత్ పేను వీడతానని చెప్పినట్లు వార్తలొచ్చాయి.
మార్చి నెలాఖరు వరకు సెలవులో ఉన్న అశ్నీర్ గ్రోవర్ను శాశ్వతంగా భారత్ పేను వీడేలా ఒత్తిడి పెంచేందుకే సంస్థలో ఆర్థిక అవకతవకలపై విచారణకు భారత్ పే బోర్డు.. కరంజావాలా అండ్ కో అనే లా ఫర్మ్ను నియమించినట్లు సమాచారం.
అల్వారెజ్ అండ్ మార్షల్ అనే సంస్థ ప్రాథమిక దర్యాప్తులో భారత్ పే సంస్థలో నియామకాలు, కంపెనీతో రోజువారీ లావాదేవీలు జరుపని వెండర్లకు చెల్లింపుల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని తేలింది. మిలియన్ల డాలర్ల పరిహారంతో సెటిల్మెంట్ చేయాలన్న తన డిమాండ్ను భారత్ పే బోర్డు అంగీకరించడానికి సిద్దంగా లేదని అశ్నీర్ గ్రోవర్ అర్థం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రోవర్ ఒక న్యాయ సంస్థను నియమించుకున్నట్లు తెలిసింది.
సంస్థను వీడేందుకు సిద్ధమైనా.. భారత్ పేలో తన వాటాలను అలాగే కొనసాగించాలని గ్రోవర్ భావిస్తున్నారని వినికిడి. సంస్థ షేర్ హోల్డర్గా, ఫౌండర్గా కొనసాగాలని అశ్నీర్ గ్రోవర్ అనుకుంటున్నారట. కానీ ఎటువంటి చెల్లింపులు జరుపకుండానే ఆయనను బయటకు పంపించాలని భారత్ పే బోర్డు నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది.
అదే సమయంలో రాజకీయాలు చేయడానికి కూడా తాను సిద్ధంగా లేనని అశ్నీర్ గ్రవర్ అన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం భారత్ పే విలువ 2.8 బిలియన్ డాలర్లు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునంటున్నారు. భారత్ పే సంస్థను స్థాపించిన తనను ఎవరూ బయటకు పంపేయలేరని భావిస్తున్నారు.
భారత్ పే అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నదని సంస్థ వర్గాల కథనం. అధికారికంగా భారత్ పే తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత అశ్నీర్ గ్రోవర్ చర్యను బట్టి పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. మెరుగైన ఫలితం కోసం గ్రోవర్ ఎదురు చూస్తున్నట్లు వినికిడి.