Hanuman AI | ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్తో పాటు భారత్కు చెందిన పలు అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలతో కూడిన కన్సార్టియం భారత్ జీపీటీ త్వరలో చాట్జీపీటీ తరహాలో ఏఐ మోడల్ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ జీపీటీ గ్రూప్నకు చెందిన ఏఐ మోడల్ను ఆవిష్కరించనున్నది. దీనికి ‘హనుమాన్’ అని నామకరణం చేసింది. ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్లో ‘హనుమాన్’ పేరిట ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ను భారత్ జీపీటీ గ్రూప్ ప్రదర్శించింది.
నయా ఏఐ మోడల్ను 11 భాషల్లో విద్య, వైద్యం, ఆర్థిక, పరిపాలన రంగాల్లో సేవలు అందించనున్నది. ఈ సందర్భంగా ఏఐ మోడల్ పనితీరును తెలియజెప్పే వీడియోను సైతం ప్రదర్శించింది. తమిళంలో ఓ వ్యక్తి ఏఐ బాట్తో, ఓ బ్యాంకర్ హిందీలో చాట్ చేసి సమాధానాలు రాబట్టారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఓ టెకీ కంప్యూటర్ కోడ్ను రాసేందుకు ఈ ‘హనుమాన్’ ఏఐ బాట్ను సైతం వినియోగించారు. ఈ ఏఐ మోడల్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలు, రిలయన్స్ ఇన్ఫోకామ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఏఐ మోడల్ ద్వారా స్పీచ్ టూ టెక్ట్స్ సైతం జనరేట్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. దీన్ని బేస్ చేసుకొని ప్రత్యేక అవసరాలు అవసరమైన మోడల్స్ను రిలయన్స్ జియో అభివృద్ధి చేయనున్నది. అయితే, ఇప్పటికే రిలయన్స్ సబ్ స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు ‘జియో బ్రెయిన్’ పేరిట మోడల్ను తయారు చేస్తున్నది. రిలయన్స్ ఇందులో విజయవంతమైతే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాల్లో భారత్ సైతం నిలువనున్నది. గతేడాది నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2014 నుంచి ఐఐటీ బాంబేతో కలిసి ఓ ప్రాజెక్టులో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. జీయో 2.0తో భారత్ జీపీటీ సైతం ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.