న్యూఢిల్లీ, మార్చి 25: అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ సంక్షోభాల నడుమ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమావేశమయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో బ్యాంకుల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. సంస్థాగత ఆర్థిక పరిపుష్ఠిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వడ్డీరేటు రిస్కులపట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లకు సూచించారు.
అలాగే రిస్క్ మేనేజ్మెంట్, డిపాజిట్లు-ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులపై దృష్టిపెట్టి ఆర్బీఐ నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్ (ఎస్బీ)లు, యూరప్లో క్రెడిట్ స్విస్ సంక్షోభంలోకి జారుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా బ్యాంకింగ్ సమీక్ష మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. సమావేశంలో బ్యాంక్ ఎండీలు, సీఈవోలు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి, ఇతర సీనియర్ అధికారులూ పాల్గొన్నారు. కాగా, గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్ఎస్సీలో ప్రభుత్వ బ్యాంకులన్నీ బ్రాంచీలను తప్పక తెరవాలని మంత్రి ఆదేశించారు.