న్యూఢిల్లీ, డిసెంబర్ 16: మార్కెట్లో నకిలీ హాల్మార్కింగ్ బంగారు నగలు ట్రేడవుతున్నాయని హాల్మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును ఖచ్చితంగా తెలిపేందుకు హాల్ మార్కింగ్ను 2021 జూన్ నుంచి కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ)గా పేర్కొనే ఆరు అంకెలు, అక్షరాలతో కూడిన ప్రత్యేక కోడ్ను ఉపయోగించే నగలను హాల్మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే హెచ్యూఐడీ బంగారం పక్కనే ‘నకిలీ హాల్మార్క్డ్’ నగలు దేశీ మార్కెట్లో ట్రేడవుతున్నాయని ఫెడరేషన్ తెలిపింది. గతంలో హాల్మార్కింగ్ కోసం ఒక లోగో ఉపయోగించేవారని, అది హెచ్యూఐడీ తరహాలో ఫూల్ ఫ్రూఫ్ కాదని హెచ్ఎఫ్ఎల్ ప్రెసిడెంట్ జేమ్స్ జోస్ వివరించారు. కొంతమంది జ్యువెల్లర్లు పాత లోగోతో కూడిన నగలు మార్కెట్లో విక్రయిస్తున్నారని, గత లోగోలతో కూడిన హాల్మార్క్డ్ ఆభరణాల్ని అమ్మకానికి ప్రభుత్వం తక్షణం మూడు నెలల గడువు విధించాలని జోస్ కోరారు. మరోవైపు అవ్యవస్థీకృత రంగంలోని ఆభరణాల వ్యాపారులు పాత నిల్వలు విక్రయానికి మరింత సమయం ఇవ్వాలని అడుగుతున్నారు.
కొత్త మార్కింగ్ ప్రక్రియలో హెచ్యూఐడీ, కేరట్, బీఐఎస్-మొత్తం మూడు లోగోలను ఉపయోగిస్తున్నట్టు ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. కొనుగోలుదారు బీఐఎస్ కేర్ యాప్లో హెచ్యూఐడీ కోడ్ను ఎంటర్చేస్తే ఆభరణం, దాని తయారీదారు, స్వచ్ఛత, బరువు తదితర సమాచారం లభ్యమవుతుంది. ఆ బంగారం వాస్తవంగా హాల్మార్క్డ్ అయ్యిందని తెలుస్తుంది.