వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) గాను బడ్జెట్ను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్నది. దీంతో మరోసారి ఆదాయం పన్ను, ట్యాక్స్ సేవింగ్ స్కీములపై చర్చ మొదలైంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ఇప్పటికే డెట్ లింక్డ్ సేవింగ్ స్కీములకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి లేఖలు రాసింది.
ప్రస్తుతమైతే ట్యాక్స్ సేవింగ్స్
మ్యూచువల్ ఫండ్లు.. కేవలం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్)లకే పరిమితమయ్యాయి. వీటిలో మూడేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉండటం వల్ల రాబడి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈఎల్ఎస్ఎస్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.
చివరి అస్త్రంగానే..
ట్యాక్స్ సేవింగ్స్ స్కీముల్లో సాధారణంగా డిసెంబర్-మార్చిలోనే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలోనే ట్యాక్స్ సేవింగ్స్కు అంతా పరుగులు పెట్టడం సహజం. మార్కెట్లో మొత్తం 38 ఈఎల్ఎస్ఎస్ స్కీములు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రూ.1.43 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు మదుపు చేశారు. గత ఐదేండ్లలో మూడేండ్లపాటు ఇవి సగటున 16-18 శాతం రాబడులను ఇచ్చాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు 70 శాతం నిధులను ఈక్విటీలలోనే మదుపు చేస్తాయి. ఎక్కువగా వేతన జీవులే వీటిలో మదుపు చేస్తున్నారు. అయితే మిగతా అనేక సాధనాల కన్నా వీటిలో రాబడి అధికంగా ఉన్నందున వీటిని కేవలం పన్ను మినహాయింపుల కోసమే కాకుండా మదుపు సాధనంగా కూడా భావించి ఇన్వెస్ట్ చేయవచ్చు.
దీర్ఘకాల మదుపు
దీర్ఘకాలం మదుపు చేయాలనుకునేవారికి కూడా ఈఎల్ఎస్ఎస్లు మెరుగైన పెట్టుబడి సాధనాలు. వీటిలో పెట్టుబడులపై మూడేండ్లపాటు లాక్ ఇన్ ఉన్నప్పటికీ.. అంతకంటే ఎక్కువ కాలానికి కూడా వీటిని మదుపు చేయవచ్చు. నిజానికి ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనమైనా దీర్ఘకాలంలోనే అధిక రాబడులను ఇస్తుంది. ఈ ట్యాక్స్ సేవింగ్స్ స్కీములు దీర్ఘకాలంలో అంటే.. ఐదేండ్లకు మించిన కాలంలో 24 శాతానికిపైగా వార్షిక రాబడులను అందించాయి. ఈ విషయాన్ని గమనించిన చాలామంది ఇన్వెస్టర్లు ఈఎల్ఎస్ఎస్లో మదుపును దీర్ఘకాలానికి కొనసాగిస్తున్నారు. ఈఎల్ఎస్ఎస్ స్కీములు ప్రధానంగా లార్జ్ క్యాప్లలోనే మదుపు చేయడం కూడా అధిక రాబడులను ఇవ్వడానికి ఓ కారణం. స్మాల్ క్యాప్ ఈక్విటీలలో ఒడిదుడుకులు ఎక్కువ.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తరహాలోనే ఈఎల్ఎస్ఎస్ స్కీములు కూడా ట్యాక్స్ సేవింగ్స్ను అందిస్తున్నప్పటికీ.. వీటికి అంతగా ప్రాచుర్యం దక్కలేదు. అందుకే పీపీఎఫ్, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ల తర్వాతనే ఈఎల్ఎస్ఎస్ల వైపు పన్ను ఆదా కోసం మదుపరులు చూస్తున్నారు. నిజానికి వాటిలో కన్నా అధిక రాబడి ఈఎల్ఎస్ఎస్లలోనే వస్తున్నది. చాలామంది మూడేండ్ల లాక్ ఇన్ పీరియడ్ అయిపోగానే విత్ డ్రా చేసి మళ్లీ వాటిలోనే ట్యాక్స్ సేవింగ్స్ కోసం మదుపు చేస్తున్నారు. అంటే ఎలాంటి కొత్త నిధులను వెచ్చించడం లేదన్నమాట. నిజానికి ఈఎల్ఎస్ఎస్ల ప్రధాన ఉద్దేశం పన్ను ఆదాతోపాటు సంపద సృష్టి కూడా. సెక్షన్ 80 సీ కింద మదుపు చేసే రూ.1.5 లక్షల పరిమితిని పెంచితే వీటిలో మదుపు పెరిగే అవకాశం ఉన్నది.