హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకుంటే రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు రూ.3,500 కోట్ల లాభాలను ఆర్జించవచ్చునని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు.
మంగళవారం సింగరేణి భవన్లో డైరెక్టర్లు, జీఎంలతో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేకంగా సమీక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నదని, ఈ పరిస్థితులను సంస్థకు అనుకూలంగా మలుచుకొని రోజుకు 2.10 లక్షల టన్నులను ఉత్పత్తి చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాలకు చేరుకోవడం మరింత సులువుకానున్నదన్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 314 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. గతేడాది కంటే ఇది 7.15 శాతం అధికం. అలాగే రవాణాలో 307 లక్షల టన్నుల లక్ష్యాన్ని మించి 330 లక్షల టన్నులు సాధించింది.
దసరాకు ముందే లాభాల్లో వాటా
సింగరేణి ఉద్యోగులకు గతంలో ప్రకటించిన రూ.1,750 కోట్ల వేజ్బోర్డు బకాయిలు చెల్లించామని, అలాగే సీఎం కేసీఆర్ ప్రకటించిన లాభాల్లో 32 శాతం వాటాగా రూ.711. 19 కోట్లను దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా సీఎండీ ప్రకటించారు. ఆ తరువాత దీపావళి బోనస్నుకూడా పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.