Layoffs | కొలువులను కాకెత్తుకెళ్తుంది. ఇంక్రిమెంట్లకు కోతలు పడతాయి. ప్రమోషన్లకు పక్షవాతం వస్తుంది. ఫారిన్టూర్ ప్రాజెక్టు కోమాలోకి వెళ్తుంది… ఇవన్నీ మాంద్యం తాలూకు లక్షణాలే. మాంద్యం.. నిశ్శబ్ద విపత్తు, చాపకింద నీరు, మెత్తని కత్తి. పైకి కనిపించే సునామీలాంటిదైతే.. ఏదో ఒకరోజు మళ్లీ నిలదొక్కుకోగలం. యుద్ధ విధ్వంసం అయితే బతికున్నామని సంతోషించగలం. కానీ కాళ్ల కింది నేలను లాగేస్తూ, రేపటి కలను భగ్నం చేస్తూ, గడ్డిపోచలాంటి ఆసరాను కూడా మిగల్చకపోతే.. అది అచ్చంగా లేఆఫ్ పీడనే! ఆ సంక్షోభం కనుచూపు మేరల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. తక్షణ కర్తవ్యం?
నీలిమకు మెటాలో ఆఫర్ వచ్చింది. మంచి జీతం. కెనడాలో ప్లేస్మెంట్. అందుకే ఇప్పటివరకూ చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదులుకుని, వీసాకు సంబంధించిన సమస్త ప్రక్రియలూ ముగించుకుంది. కెనడాలో అడుగు పెట్టింది. ఆ అలసట తీరిందో లేదో… రెండే రెండు రోజుల్లో తనను ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు సమాచారం. దిమ్మతిరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకు పైగా ఉద్యోగాల తీసివేతల్లో ప్రతి ఒక్కరిదీ ఇలాంటి కథే. కంపెనీ మొదలైన తొలి రోజుల నుంచీ ఇరవై ఏండ్లపాటు పనిచేసినవాళ్లు, ‘వండర్ఫుల్’ అంటూ ఆమధ్యే కితాబు అందుకున్నవాళ్లు, తమ మీదే ప్రాజెక్ట్ మొత్తం ఆధారపడి ఉందన్న భరోసాతో బతికేస్తున్నవారు… ఈ తీసివేతల వెతలో దీనంగా కనిపిస్తున్నారు. భార్యాభర్తలు ఒకే కంపెనీ మీద ఆధారపడిన విషయం కానీ, ఉద్యోగి నిండుచూలాలని కానీ, సమర్థుడిగా సంపాదించుకున్న పేరు కానీ… ఏవీ పరిగణనలోకి తీసుకోలేదు. గాలివానకు గడ్డిపోచలతోపాటు, మహావృక్షాలూ నేలకూలినట్టు.. ఏ రంగానికీ మినహాయింపు లేదు.
ఆర్థిక వ్యవస్థ మీద కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రత్యేకించి, అసంఘటిత రంగాలను కోలుకోలేనంత దెబ్బతీసింది. చిన్న వ్యాపారస్తులు, కూలీలు, రోజువారీ శ్రమతో బతుకుబండి లాగించేవారికి శరాఘాతమే అయింది. అదే సమయంలో ఆన్లైన్ వ్యాపారం బాగా పుంజుకుంది. ఇ-పాఠాలు బోధించే ఎడ్టెక్ సంస్థలు, అమెజాన్లాంటి డెలివరీ కంపెనీలు… ఇలా ఆన్లైన్ వ్యాపారాల అవసరం కూడా పెరిగింది. చదువుల కోసం మొబైల్ ఫోన్లను, వినోదం కోసం ఒటీటీలను జనం ఆదరించారు. పెరిగిన గిరాకీకి అనుగుణంగా చాలా సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగస్తులను చేర్చుకున్నాయి. కొవిడ్ వేవ్ దాటిపోయి, కరోనా భయం పలుచబడిపోయాక.. ఈ అదనపు ఉద్యోగస్తులు పెనుభారంగా తోస్తున్నారు. ఎడ్టెక్ సంస్థ బైజూస్ తమ కంపెనీలో అయిదుశాతం సిబ్బందిని తొలగించబోతున్నట్టు అక్టోబర్లోనే చెప్పింది. కానీ ఆ సంస్థ, ఏరోజుకారోజు తొలగిస్తున్న ఉద్యోగుల సంఖ్యను చూస్తే అంతకంటే ఎక్కువమంది తలకాయల మీదే కత్తి వేలాడుతున్నట్టు అనుమానం వస్తున్నది.
నెట్ఫ్లిక్స్ది మరో కథ. జనాలకు ఒటీటీలను అలవాటు చేస్తున్న సమయంలో, తన సబ్స్క్రిప్షన్ రుసుము విషయంలో పట్టుదలకు పోయింది. ఫలితంగా రేసులో వెనకబడింది. దానికి విరుగుడుగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నది. ఓలా, స్విగ్గీ, అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థలన్నీ ఇప్పటికే వందలాది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాయి. కొవిడ్ తర్వాతి మార్పులే ఇందుకు కారణం అంటున్నాయి.
రిసెషన్ ఓ విషవలయం. పెరుగుతున్న ధరలు, వడ్డీరేట్లు.. ఉత్పత్తి మీద, జీవితాల మీదా ప్రభావం చూపిస్తాయి. ఆర్థిక వ్యవస్థ వేగం తగ్గిపోతుంది. ఉత్పత్తి నుంచి ఉపాధి వరకూ ప్రతి రంగమూ ఒత్తిడిలో పడుతుంది. అయితే ఈ వలయాన్ని కదిపే అంశాలేమిటి అన్నది కీలకం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని అనుకుంటున్న సమయంలో కొవిడ్ వచ్చేసింది. ప్రపంచ దేశాలను కుదేలు చేసింది. ఆ దెబ్బ నుంచి ఊపిరి పీల్చుకుంటున్న దశలో రష్యా ఉక్రెయిన్ యుద్ధమేఘాలు మన మొహాల మీద దుమ్ముకొట్టాయి. చైనాలో పుట్టగొడుగులా పెరిగిన రియల్ ఎస్టేట్ రంగం అప్పులు దొరక్క దివాలా తీసింది. ఇలాంటి అనిశ్చిత వాతావరణాల మధ్య డాలర్ మారకం విలువ పెరుగుతూ వచ్చింది. దాంతోపాటే వడ్డీరేట్లు, చమురు ధరలూ పెరిగిపోయాయి. లోకం ఆర్థికమాంద్యం దిశగా అడుగులు వేసింది. కొవిడ్ చిన్న సంస్థలను దెబ్బతీస్తే, ఆర్థికమాంద్యం పెద్ద కంపెనీలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అదే జరిగింది ఇప్పుడు.
ఉక్రెయిన్ యుద్ధం, తరుముకొస్తున్న మాంద్యం, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికత, పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలు… ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా చాలా సాఫ్ట్వేర్ దిగ్గజాలు మంచి లాభాలనే గడించాయి. కానీ ఆ కంపెనీల్లో భవిత గురించి భయం కనిపిస్తున్నది. లాభాల బాట స్థిరంగా ఉండాలంటే… వ్యయాలను తగ్గించుకోవడమే మార్గమనే తేలికపాటి సూత్రాన్ని ఎంచుకున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థల్లో దాదాపు 30 శాతం ఉద్వాసన మానవ వనరుల విభాగంలోనే జరగడం ఇందుకు ఉదాహరణ, అలాగే బైజూస్ తన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ మీద వేటు వేసింది. ఏమాత్రం ‘ఉపయోగం’ లేదనుకునే విభాగాలపైనే నిష్కర్షగా కరవాలం ఝళిపిస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు.
ఆమధ్యకాలంలో ఉద్యోగస్తులకు పెరిగిన డిమాండ్ వల్ల ముందూవెనకా చూడకుండా పెద్దపెద్ద జీతాలకు ఒప్పుకొని కొలువుల్లోకి తీసుకున్నారు. అప్పటికే ఉన్న సిబ్బందికి వేతనాల పెంపూ ఉదారంగానే జరిగింది. ఇప్పుడు ధోరణి మారింది. ఇదే జీతానికి నలుగురైదుగురు వస్తారనే ఆలోచన మొదలైంది. భారీ వేతనాలు అందుకుంటున్న సీనియర్ ఉద్యోగులనే లక్ష్యం చేసుకోవడం ఇందుకు సూచనగా చెప్పుకోవచ్చు.
.. పైవన్నీ కార్పొరేట్లు చెప్పిన కారణాలు, తమ కరాళ విన్యాసానికి సాకుగా చూపిస్తున్న అంశాలు. కాస్త లోతుగా గమనిస్తే… ఆశ్చర్యకరమైన విషయాలూ కనిపిస్తాయి. మూలధనం కోసం వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన చెప్పిన కంపెనీలు ఏమంత నష్టాల్లో లేవు. తాజా త్రైమాసికంలో అద్భుతమైన లాభాలు గడించాయి. అంతేకాదు.. వ్యాపార విస్తరణ కోసం భారీ
మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ప్రాజెక్ట్ OpenAI మీద పది బిలియన్ డాలర్లు వెచ్చించబోతున్నట్టు అంచనా. ఇలాంటి పెట్టుబడుల కోసం భారీగా నిధులు అవసరం. ఆ ప్రాజెక్టులు నడిపించడానికి నిరంతరాయంగా నగదు సరఫరా (క్యాష్ ఫ్లో) ఉండాలి. అనధికారిక విశ్లేషణ ప్రకారం ఓ ప్రముఖ కంపెనీ తన తాజా పెట్టుబడిలో ప్రతి మిలియన్ డాలర్లకూ ఓ ఉద్యోగిని తీసేసింది. దశాబ్దాల తరబడి సేవచేసి, వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్న వ్యక్తులను కూడా నిర్మొహమాటంగా తొలగించడానికి కారణం… జీతాల పద్దులో వీలైనంత మిగుల్చు కోవాలన్న దుగ్ధ.
సాంకేతికత పెరుగుతున్నకొద్దీ పనులు సులువు అవుతున్నాయి. పదిమంది శ్రమించాల్సిన చోట ఒక్కరే సరిపోతారు అనే స్థాయికి వచ్చేసింది ఆటోమేషన్. ఉదాహరణకు మెక్డొనాల్డ్స్ అంటేనే యూనిఫామ్లో ఉన్న సర్వీస్ సిబ్బంది గుర్తుకొస్తారు. కానీ ఇటీవల టెక్సాస్లో ప్రారంభించిన సరికొత్త బ్రాంచ్లో ఆర్డర్ తీసుకోవడం నుంచీ డెలివరీ వరకూ అన్నీ యంత్రాల సాయంతోనే జరుగుతున్నాయి. ఇక సాఫ్ట్వేర్ కంపెనీల సంగతి చెప్పేదేముంది. రోజురోజుకూ ప్రోగ్రామింగ్, ఎగ్జిక్యూషన్ సులువైపోతున్నాయి. భవిష్యత్తు ChatGPT లాంటి కృత్రిమ మేధస్సులదే అని దిగ్గజ కంపెనీలు నిర్ణయించేసుకున్నాయి. డైరీ ఫామ్ నుంచి క్లాస్రూమ్ వరకూ ప్రతి సందర్భంలోనూ IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ద్వారా సులువుగా, కచ్చితంగా, తక్కువ ఖర్చుతో పని జరిగిపోతున్నది. దాంతో మనుషులు లేకపోయినా కొన్ని పనులు జరుగుతాయిలే అన్న ధీమా కనిపిస్తున్నది.
కొవిడ్ రోజుల నుంచి యాజమాన్యాలలో ఓ చిత్రమైన ధోరణి కనిపిస్తున్నది. మిగతా సమయాల్లో ఉద్యోగులను తీసేస్తే.. ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. కరోనానో, ఆర్థిక మాంద్యాన్నో సాకుగా చూపిస్తే ఎవరూ నోరెత్తరు. మెటా (ఫేస్బుక్), ఆల్ఫాబెట్ (గూగుల్), మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ట్విటర్లు మంచి లాభాలే సంపాదిస్తున్నాయి. అయినా, యాభైవేలకు పైగా ఉద్యోగులకు ఉద్వాసన చెప్పారు. వారిలో ఎక్కువమంది భారతీయులే. ‘ఉద్యోగం అనేది ఓ శాశ్వత సమస్యకు తాత్కాలిక పరిష్కారమే’ అనుకోగలిగితేనే.. కొలువుల భ్రమలోంచి బయట పడగలం. కొత్త జీవితాన్ని ప్రారంభించగలం. వీలైతే మనమే కొన్ని ఉద్యోగాలు సృష్టించగలం.
ఒక్క రంగాన్నే నమ్ముకుని, దానికోసం శ్రమిస్తూపోతే భవిష్యత్తుకు ఢోకా ఉండదనే రోజులు పోయాయి. 365 Data Science విశ్లేషణ ప్రకారం ఈ లేఆఫ్స్లో ఉద్యోగాలు కోల్పోయినవారి సగటు అనుభవం 11.5 ఏళ్లు!
భారీ ఉద్వాసనలు జరిగినప్పుడు మహిళల పట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తుందనే వాదన ఉంది. దాన్ని నిజం చేస్తూ, తొలగించిన ఉద్యోగులలో56 శాతం మహిళలే అని చెబుతున్నది ఓ నివేదిక.
అమెరికాలోని దాదాపు 80 వేల మంది భారతీయులు ఈ ఉద్వాసనల్లో ఉపాధి కోల్పోయారని ఇండియన్ ఎక్స్ప్రెస్ అంచనా. వీరిలో ఎక్కువమంది H-1B/ L1 వీసాల మీద ఉన్నారు. వీళ్లంతా రెండు నెలల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ నిశితంగా గమనిస్తే కేవలం పదిశాతం మాత్రమే కొత్త ఉద్యోగాల్లో చేరినట్టు కనిపిస్తుంది.
ఉద్యోగుల తొలగింపు అమెరికాలోని పెద్ద కంపెనీలకే పరిమితం కావడం లేదు. మనదేశంలో 70కి పైగా స్టార్టప్స్ 21 వేల మంది సిబ్బందిని తొలగించినట్టు బిజినెస్ ఇన్సైడర్ చెబుతున్నది. వేదాంతు, మెడిబడి, షేర్చాట్ లాంటి కంపెనీలన్నీ ఉద్వాసన బాటపట్టాయి.
అప్పటివరకూ శ్రమే దైవం, సంస్థే జీవితం అనుకున్నవారికి.. ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తొలగించగానే తీవ్రమైన నిస్తేజం కలుగుతుంది. మనమీద మనకు అపనమ్మకం, కొలీగ్స్ దూరమైన ఒంటరితనం, ఆర్థిక అభద్రత, భవిష్యత్తు పట్ల భయం, అవమానభారం ఒక్కసారిగా చుట్టుముట్టి కుంగుబాటుకు దారితీస్తాయి. ఓ పరిశోధన ప్రకారం.. జీవితంలో అన్నింటికంటే మనస్తాపం కలిగించే సందర్భం నిరుద్యోగం. కాబట్టి దీన్ని తక్కువగా అంచనా వేయకుండా నిపుణుల కౌన్సెలింగ్ తీసుకోవాలి. తన చుట్టూ ఉన్నవాళ్లు చిన్నచూపు చూస్తున్నారనే న్యూనత వదిలి, మనసులోని బాధను ఆత్మీయులతో పంచుకోవాలి. ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోవాలి.
కలల కంపెనీ, అద్భుత సౌకర్యాలు, మంచి జీతం, పూర్తి భద్రత.. అనుకునే రోజులు పోయాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఉద్వాసన నుంచి తప్పించుకునేందుకు, ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి.
..అన్నిటికీ మించి ఏ ఉద్యోగమూ శాశ్వతం కాదనే సత్యాన్ని గ్రహించాలి. ఏదైనా ఉపద్రవం రాబోతున్నదని తెలిస్తే, భయపడకుండా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జీతంలో కొంతభాగాన్ని పిల్లల చదువుకు, నెలవారీ వాయిదాలకు ఎలా పక్కన పెడతామో… భవిష్యత్తు కోసం కూడా అంతే కచ్చితంగా వేరుచేయాలి. ఏదో ఒకరోజు కొలువును కాకెత్తుకెళ్లే అవకాశం ఉందని మనసును సిద్ధపరుచుకున్నప్పుడు జాగ్రత్తలు వాటంతట అవే వస్తాయి.
① ఇన్నాళ్లూ కష్టపడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మనసును కుదుటపరుచుకున్నాక, మరో ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టండి.
② వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సోషల్ మీడియా ద్వారా ఉన్న పరిచయాల్లో ఎవరైనా కొత్త ఉద్యోగానికి రిఫర్ చేయగలరేమో చూడండి.
③ ఇప్పటివరకూ పనిచేసిన రంగంలో అవకాశాలు లేకపోతే.. కొత్త మార్గాలూ ఆలోచించవచ్చు.
④ ఫలానా ఉద్యోగంలోనే చేరాలనే మొండిపట్టు వద్దు. నైపుణ్యం, అనుభవాన్ని బట్టి ఎన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయో గమనించండి.
⑤ మార్కెట్లో ఉద్యోగావకాశాలను ప్రకటించే, మనల్ని సంస్థలకు పరిచయం చేసే లింక్డ్ఇన్ లాంటి వేదికలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తిగా ఉపయోగించుకోండి.