Defaulters | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. కార్పొరేట్ల రుణాలను మాత్రం లక్షల కోట్లలో రైటాఫ్ చేస్తున్నాయి. బీజేపీ తొమ్మిదేండ్ల హయాంలో ఈ ప్రహసనం మరింతగా ఎక్కువయ్యింది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్టు గత డిసెంబర్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమాధానమిచ్చారు. మొత్తంగా గడిచిన తొమ్మిదేండ్లలో రూ. 15 లక్షల కోట్ల బకాయిలను రైటాఫ్ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, అప్పును తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే రుణాలను ఎగ్గొట్టే విల్ఫుల్ డిఫాల్ట్ల సంఖ్య (ఉద్దేశపూర్వక ఎగవేతలు) బీజేపీ హయాంలో ఏకంగా పది రెట్లు పెరిగింది. 2014 కంటే ముందు విల్ఫుల్ డిఫాల్ట్స్ విలువ రూ. 25 వేల కోట్లుగా ఉంటే, 2022 నాటికి ఈ విలువ రూ. 2.4 లక్షల కోట్లు దాటింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు విల్ఫుల్ డిఫాల్టర్లేనని (ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్కు ప్రభుత్వమే బదులిచ్చింది. ఇదే విషయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలోనూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
తమ ప్రభుత్వహయాంలో రుణ ఎగవేతల విలువ పది రెట్లు పెరిగిందన్న విషయాన్ని కప్పిపుచ్చుకొంటున్న బీజేపీ ప్రభుత్వం.. మొండి బాకాయిల పాపాల భైరవులు బ్యాంకు అధికారులేనని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక, మొండి బకాయిల రికవరీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, మోసపూరిత ఖాతాదారులతో రాజీ పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఓ నోటిఫికేషన్లో బ్యాంకులకు సూచించింది. డిఫాల్టర్లు ఎంత మొత్తం చెల్లించగలరో తదితర అంశాలను పరిశీలించాలని వెల్లడించింది. అయితే, లక్షల కోట్లు ఎగనామంపెట్టి బ్యాంకు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఎగవేతదారులతో ‘రాజీ పరిష్కారం’ చేయాలంటున్న ఆర్బీఐ, కేంద్రం.. వేల రూపాయల వంటి చిన్న మొత్తాలను తీసుకొనే సామాన్యులపై దౌర్జన్యంగా వ్యవహరించడమేంటని హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.