Loan Write Off | సామాన్యుల ముక్కుపిండి ఇచ్చిన అప్పుల్ని వసూలు చేసుకుంటున్న బ్యాంకులు.. కార్పొరేట్ల దగ్గర మాత్రం సైలెంటైపోతున్నాయి. ఏకంగా లక్షల కోట్ల రూపాయలనే రైటాఫ్ చేసేస్తున్నాయి. ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కారు హయాంలోనే రూ.25 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయి మరి. కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలుండటంతో బ్యాంకర్లు.. నష్టపోతున్నామని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటున్నదన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంలో కొలువుదీరే ప్రభుత్వమేదైనా దేశంలోని బ్యాంకుల తలరాత మాత్రం మారడం లేదు. ఏండ్లు గడుస్తున్నకొద్దీ పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతుండటం ఇప్పుడు భారతీయ బ్యాంకిం గ్ వ్యవస్థనే కాదు.. యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే కలవరపాటుకు గురిచేస్తున్నది. 2014 ఏప్రిల్ మొదలు ఈ ఏడాది మార్చి ఆఖరుదాకా బ్యాంకులు ఏకంగా రూ.25 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ (ఓ రకంగా దీన్ని మాఫీ అనే చెప్పవచ్చు) చేశాయి. ఈ మేరకు సూరత్కు చెందిన సామాజిక కార్యకర్త సంజయ్ ఎజ్హవా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన పిటిషన్కు ఆర్బీఐ తాజాగా తెలియజేసింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపికైంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయి లో చర్చలకూ దారితీస్తుండగా.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం సైతం రేగుతున్నది.
ఇంతగా రైటాఫ్ జరిగిన ఈ కార్పొరేట్ రుణాల్లో రాజకీయ జోక్యం ఉందన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేంద్రంలోని రాజకీయ పెద్దల అండదండలతోనే కార్పొరేట్లు ఇష్టారీతిన బ్యాంక్ రుణాలు తీసుకున్నారని, చివరకు అదే రాజకీయ నాయకుల జోక్యంతో తప్పించుకున్నారని, ఫలితంగా మునిగింది బ్యాంకులేనన్న విమర్శలు ప్రస్తుతం గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.10.41 లక్షల కోట్ల రుణాల్ని రైటాఫ్ చేయగా, మరో రూ.14.53 లక్షల కోట్లు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు రైటాఫ్ చేశాయి. దీంతో గడిచిన తొమ్మిదేండ్లకుపైగా కాలంలో రైటాఫ్ అయిన మొత్తం లోన్లు రూ.24.95 లక్షల కోట్లకు చేరాయి. అంతేగాక యూపీఏ 11 ఏండ్ల హయాంలో జరిగిన రైటాఫ్ రుణాల కంటే గత 9 ఏండ్లలో జరిగినవే 810 శాతం ఎక్కువని తేలడం ఇక్కడ గమనించదగ్గ అంశం.
మోదీ హయాంలో బ్యాంకులు రైటాఫ్ చేసిన ఈ రూ.25 లక్షల కోట్ల రుణ భారం.. అంతిమంగా సామాన్యులు, రైతులు, చిన్నచిన్న రిటైల్ రుణాలు తీసుకున్నవారిపైనే పడుతుందని బ్యాంకింగ్ రంగ పెద్దలే చెప్తుండటం ఇప్పుడు అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో బడా నేతలు, పారిశ్రామికవేత్తలే లాభపడ్డారు మరి. నిజాయితీగా తీసుకున్న రుణాల్ని చెల్లించే మధ్యతరగతిపై కఠినంగా వ్యవహరించే బ్యాంకర్లు.. కార్పొరేట్లపట్ల మాత్రం ఉదాసీన వైఖరినే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు దేశంలో వేల కోట్ల అప్పులు తీసుకుని.. వాటిని ఎగవేసి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్లను పట్టుకునే విషయంలోనూ మోదీ సర్కారు తీరు అభ్యంతరకరంగా ఉందంటున్నారు మెజారిటీ ఆర్థిక నిపుణులు. ఇప్పటిదాకా వసూలైనదే ఇందుకు అద్దం పడుతున్నది. అలాగే బ్యాంకులపై నమ్మకంతో డిపాజిట్లు చేసిన సామాన్యుల కష్టార్జితమే ఇదంతా అన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
-బిజినెస్ డెస్క్