5 Days Work for Banks | ఇక నుంచి ఐటీ రంగ ఉద్యోగుల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదు రోజులు పని దినాల విధానం అమల్లోకి రాబోతున్నది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రతిపాదనలు సమర్పించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఆ ఐదు రోజుల్లో ప్రతి రోజూ.. ప్రతి బ్యాంకు ఉద్యోగి నుంచి అధికారి వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాలని ఐబీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. వచ్చే శుక్రవారం ఈ విషయమై చర్చించడానికి వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల వేదిక.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ (యూఎఫ్బీయూ) ప్రతినిధులతో ఐబీఐ సమావేశం కానున్నది.
ఇప్పటికే భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో వారంలో ఐదు రోజుల పని విధానం అమల్లోకి తీసుకొస్తూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఇదే విధానం బ్యాంకులకూ అమలు చేయాలని ఈ నెల 19న జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న యూఎఫ్బీయూ ప్రతినిధులు కోరారు.
ఇప్పటికే బ్యాంకులకు వారంలో ఐదు రోజులు పని విధానంపై తమకు అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఐబీఏ తన ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎంతో కాలంగా బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు తమకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మలు చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఎల్ఐసీకి కేంద్రం ఈ విధానాన్ని వర్తింపచేయడంతో బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్ మరోమారు ముందుకు వచ్చింది. ఈ విషయమై ఇటూ ఐబీఏ, అటు యూఎఫ్బీయూ ప్రతినిధులు చర్చించనున్నారని తెలుస్తున్నది.
వారంలో ఐదు రోజుల పని విధానంతోపాటు ఉద్యోగుల వేతనం, రిటైర్డ్ ఉద్యోగులూ అధికారులకు ఆరోగ్య బీమా పాలసీ తదితర అంశాలను కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లింది ఐబీఏ. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.2 లక్షల వరకు ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్యూ అంగీకారం తెలిపింది. దీనిపై టాపప్ పాలసీ కింద ఆప్షనల్ విధానంలో రూ.10 లక్షల బీమా పాలసీ ఇవ్వడానికి అనుమతించాలని కోరుతున్నది.