న్యూఢిల్లీ: ఒకవైపు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న కేంద్ర సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన పది లక్షల మందికి పైగా ఉద్యోగులు సోమవారం నుంచి రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె వల్ల వివిధ బ్యాంకుల శాఖల వద్ద నగదు విత్డ్రాయల్స్, డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, రుణాలకు ఆమోదం వంటి లావాదేవీలు నిలిచిపోయాయి.
అయితే, ఏటీఎంల్లో మాత్రం నగదు అందుబాటులో ఉంది. సోమవారం సంబంధిత బ్యాంకుల శాఖల నుంచి ఏటీఎంల్లో నగదు నింపుతున్న ఏజెన్సీలకు ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం ఏటీఎంల్లో నగదు నింపడం కష్ట సాధ్యం కావొచ్చునన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్.. బ్యాంకుల ప్రైవేటీకరణపై సర్కార్ విధాన నిర్ణయాన్ని బయటపెట్టింది. ఆరు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులను మాత్రం ప్రైవేటీకరించొద్దని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు నీతి ఆయోగ్ వర్గాలు తెలిపాయి. ఆ జాబితాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు… భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి.
ఇప్పటికే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఒక జీవిత బీమా సంస్థను ప్రయివేటీకరించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్ణయం తీసుకునే అవకాశం అవకాశం ఉంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) త్వరలో ఈ అంశాన్ని మంత్రుల గ్రూప్ ముందుకు తీసుకెళ్లనున్నది.
2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్, కెనరాబ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు విలీనం అయ్యాయి.
ఇక భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సర్దుబాటు చర్యల ఫ్రేమ్వర్క్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్లు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ బ్యాంకుల భవితవ్యాన్ని ఆర్బీఐ సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఈ ఫ్రేమ్వర్క్ నుంచి ఐడీబీఐ బ్యాంక్ బయటకు వచ్చింది.