హైదరాబాద్, మే 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ వితరణలో ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ రూ.1,35,240 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. అంతక్రితం ఏడాదితో ఇచ్చిన రుణాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికమని పేర్కొంది.
ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ వితరణలో 10.27 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.66 శాతం అధికమయ్యాయి. విలువ పరంగా చూస్తే బీవోఎం ఇచ్చిన దానికంటే 18 రెట్లు అధికంగా ఎస్బీఐ రూ.24,06,761 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. అలాగే యూనియన్ బ్యాంక్ కూడా రూ.6,99,269 కోట్లు ఇచ్చింది.