న్యూఢిల్లీ, జూన్ 19: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకున్నది. పీఎస్యూ బ్యాంక్ల్లో ఈ మార్క్ను చేరుకున్న రెండవదిగా నిలిచింది. దేశంలో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) రూ.1 లక్ష కోట్ల మార్క్ మార్కెట్ విలువను దాటిన తొలి బ్యాంక్. ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.08 లక్షల కోట్లు. సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం మేర పెరిగి రూ.193.75 వద్ద నిలిచింది. ఇది నెలరోజుల్లో 7 శాతంపైగా ర్యాలీ జరిపింది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో బీవోబీ నికరలాభం 168 శాతం వృద్ధితో రూ. 4,775 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 34 శాతం పెరిగి రూ. 11,525 కోట్ల వద్ద నిలిచింది. అలాగే బ్యాంక్ స్థూల ఎన్పీఏలు సగం వరకూ తగ్గాయి.