ముంబై, మే 27: దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు నమోదయ్యాయని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది. 2020-21లో జరిగిన రూ.1.38 లక్షల కోట్లకంటే ముగిసిన ఏడాది మోసాల మొత్తం విలువ తగ్గినప్పటికీ, సంఖ్య పెరిగిందని శుక్రవారం విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. 2021-22లో మోసాల సంఖ్య 23.69 శాతం పెరిగి 9,103కు చేరింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 7,359. రూ.1 లక్ష, అంతకుమించిన మోసాలనే ఆర్బీఐ డాటా పరిగణనలోకి తీసుకుంది. నివేదిక ప్రకారం ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రధానంగా కార్డ్/ఇంటర్నెట్ సంబంధిత మోసాలు జరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ మోసాలు చోటుచేసుకున్నాయి. సంఖ్యా పరంగా మొత్తం విలువలో 97 శాతం (రూ.58,328 కోట్లు) రుణ పోర్ట్ఫోలియో మోసాలే.
రూ.2వేల నోట్లు తగ్గుతున్నాయ్
రూ.2000 నోట్ల చలామణీ క్రమేపీ తగ్గుతున్నది. ఈ ఏడాది మార్చి చివరినాటికి మొత్తం చలామణీలో ఉన్న నోట్లలో రూ.2000 నోట్లు 1.6 శాతమేనని (214 కోట్లు) ఆర్బీఐ నివేదిక తెలిపింది. 2020 మార్చినాటికి వీటి చలామణీ 2.4 శాతం (274 కోట్లు) ఉండగా, 2021 మార్చికల్లా ఇది 2 శాతానికి (245 కోట్లు) తగ్గింది. అయితే 2022 మార్చి చివరినాటికి మొత్తం సర్క్యులేషన్లో ఉన్న నోట్ల సంఖ్య 12,437 కోట్ల నుంచి 13,053 కోట్లకు పెరిగింది. చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో అత్యధికంగా 34.9 శాతం రూ.500 నోట్లే. తదుపరి 21.3 శాతం రూ.10 నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి.
డిజిటల్ కరెన్సీ మంచి చెడుల్ని విశ్లేషిస్తున్నాం
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటామని, కాన్సెప్ట్ ప్రూఫ్, పైలెట్స్ తదితర దశల్లో ఒకదానితర్వాత మరోదానిని కఠినంగా పర్యవేక్షించిన మీదట విడుదల చేయనున్నట్లు రిజర్వ్బ్యాంక్ నివేదిక పేర్కొంది. దేశంలో సీబీడీసీ ప్రవేశపెట్టడంతో ఏర్పడే మంచి చెడుల్ని విశ్లేషిస్తున్నామని, ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, కరెన్సీ సామర్థ్యం తదితర లక్ష్యాలకు లోబడి సీబీడీసీని డిజైన్ చేయాల్సి ఉందని ఆర్బీఐ వివరించింది. భారత్ అధికారిక డిజిటల్ కరెన్సీగా రిజర్వ్బ్యాంక్ సీబీడీసీని 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెడుతుందంటూ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. డిజిటల్ కరెన్సీ విడుదలకు తొందరపడబోమని, అన్ని అంశాల్నీ జాగ్రత్తగా పరిశీలిస్తామని..బడ్జెట్ ప్రకటన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
రిటైల్ ధరలు మరింత పైకి
శక్తికాంత్ దాస్ హెచ్చరిక ప్రస్తుతం అత్యంత గరిష్ఠస్థాయిలో ఉన్న టోకు ద్రవ్యోల్బణం ప్రభావం క్రమేపీ రిటైల్ ధరల్లోకి వ్యాపిస్తుందని, ఈ వ్యాప్తిలో కొంత జాప్యం జరిగినా, రానున్న రోజుల్లో టోకు ధరల్ని అనుసరించి రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ హెచ్చరించారు. శుక్రవారం ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. ముగిసిన ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో 15.08 శాతానికి పెరగ్గా, రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠస్థాయి 7.79 శాతానికి పెరిగింది. ఈ రెండు ద్రవ్యోల్బణాల మధ్య అధికంగా ఉన్న అంతరాన్ని ప్రస్తావిస్తూ టోకుస్థాయిలో అధికంగా పెరిగిన ధరల్ని కొన్ని రంగాలు వినియోగదారులకు క్రమేపీ మళ్లింపు జరుపుతున్నాయని, దీంతో రిటైల్ ధరలు సైతం టోకుస్థాయిని అందుకుంటాయన్నారు. తయారీ ఉత్పత్తుల టోకు ధరలు వినియోగదారులకు కాస్త ఆలస్యంగా మళ్లింపు జరుగుతుందని ఆర్బీఐ వార్షిక నివేదిక సైతం వివరించింది.
ఫిన్టెక్లకు పాలసీ
ఫైనాన్షియల్ రంగంలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు నిమగ్నంకావడంతో ఏర్పడే వ్యవస్థాపర రిస్క్లపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలు, బిగ్టెక్ల కోసం ఒక విధానాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపొందించనున్నట్టు కేంద్ర బ్యాంక్ తెలిపింది. ఫిన్టెక్ విభాగంలోకి పెద్ద టెక్నాలజీ కంపెనీలు ప్రవేశించడంతో ఆర్థిక స్థిరత్వం, సైబర్ సెక్యూరిటీ, వినియోగదారుల రక్షణలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని, అవి ప్రవేశపెట్టే కొత్త ఉత్పత్తులకు వీలుకల్పిస్తూనే వాటిని నియంత్రించవలసి ఉన్నదని ఆర్బీఐ అభిప్రాయపడింది.సాంప్రదాయ బ్యాంక్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పటిష్టమైన రెగ్యులేషన్లో ఉన్నట్టుగా ఫిన్టెక్ పరిశ్రమపై చట్టాలు, నియంత్రణలు తేవాల్సిన అవసరం ఉన్నదన్నది.
రూ.61.9 లక్షల కోట్లకు బ్యాలెన్స్ షీట్
ద్రవ్య విధానం, రిజర్వుల నిర్వహణను ప్రతిబింబించే రిజర్వ్బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.46 శాతం వృద్ధితో రూ.61.9 లక్షల కోట్లకు చేరింది.ఆదాయం 20.14 శాతం పెరగ్గా, ఖర్చులు ఏకంగా 280 శాతం అధికమైనట్టు వార్షిక నివేదిక వెల్లడించింది. కార్యకలాపాల మిగులు మాత్రం నిరుడుకంటే 69 శాతం తగ్గుదలతో రూ. 99,122 కోట్ల నుంచి రూ.30,307 కోట్లకు పడిపోయింది. ఈ మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రతిపాదనను గతవారం ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు ఆమోదించిన సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుడులు, దేశీ పెట్టుబడులు, బంగారం, రుణాలు, అడ్వాన్సులు పెరగడం ద్వారా అసెట్స్ వృద్ధిచెందాయని, డిపాజిట్లు, నోట్లు పెరగడంతో లయబిలిటీల వృద్ధి జరిగిందని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 695.31 టన్నుల నుంచి 760.42 టన్నులకు పెరిగాయి.