ముంబై, జూన్ 17: లోన్ రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని రుణ సంస్థలు అప్పుల వసూళ్లలో అడ్డగోలు వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఆక్షేపించారు. రుణగ్రహీతలకు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫోన్కాల్స్ చేస్తున్నారని, అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు ఎంతమాత్రం సమర్థనీయం కాదన్న దాస్.. ఒకవేళ ఇటువంటి వాటికి ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలుగనుక పాల్పడితే ఊరుకోబోయేది లేదని, కఠిన చర్యలే ఉంటాయని హెచ్చరించారు.
శుక్రవారం ఇక్కడ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఆధ్వర్యంలో జరిగిన ‘ఆధునిక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సదస్సు 2022’లో దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోన్ రికవరీ ఏజెంట్ల దాష్ఠీకాలపై ధ్వజమెత్తారు. ఇటీవలికాలంలో రెండు తెలుగు రాష్ర్టాలుసహా దేశంలోని ఆయా ప్రాంతాల్లో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు బలైపోయిన ఉదంతాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటికి సంబంధించి తమకూ ఫిర్యాదులు వస్తున్నాయని దాస్ తెలిపారు. పోలీసులు, ఇతర ఏజెన్సీలతో చర్యల కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కాగా, సురక్షితమైన డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్కు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే తెస్తామన్నారు.
ద్రవ్యోల్బణంపై విమర్శలపట్ల..
ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్బీఐపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ చేసిన విమర్శలపట్ల దాస్ ఈ సందర్భంగా స్పందించారు. అక్టోబర్ 2019 నుంచి ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం స్థాయికి ద్రవ్యోల్బణం ఏనాడూ దిగిరాలేదని, పైగా గడిచిన 32 నెలల్లో 18 నెలలు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటి నమోదైందని ఓ ఆర్టికల్లో సుబ్రమణ్యన్ అన్నారు. దీంతో ద్రవ్యోల్బణం అదుపుపైనే దృష్టి పెడితే అది దేశ ఆర్థిక వ్యవస్థ వినాశనానికే దారితీస్తుందని ఒకింత తీవ్రంగానే దాస్ బదులిచ్చారు. అటు ద్రవ్యోల్బణం కట్టడి, ఇటు వృద్ధిరేటుకు సమప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం ఆర్బీఐకి చాలా అవసరమన్నారు.
ఆర్థిక సేవల్లో టెక్నాలజీ దిగ్గజాలపై..
కస్టమర్ డాటా, అధునాతన ఆల్గరిథమ్లను వినియోగిస్తూ రుణ కార్యకలాపాల్లో గూగుల్, అమెజాన్, మెటా తదితర భారీ టెక్నాలజీ సంస్థలుంటే అది మితిమీరిన పరపతి వంటి వ్యవస్థీకృత సమస్యలకు దారితీయవచ్చని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీషన్, డాటా షేరింగ్, డాటా ప్రొటెక్షన్, కీలక సేవల నిర్వహణ స్థితిస్థాపకతలకూ ఇబ్బందేనన్నారు. కాగా, ఆర్థిక సేవల్లో బడా టెక్నాలజీ సంస్థలపై గతంలోనూ దాస్ ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చడం గమనార్హం.