‘తెలంగాణలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. మాకిది కేవలం ఓ ఉత్పాదక కేంద్రమే కాదు అంతకంటే ఎక్కువ. నిజంగా బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్కు ఇదో మైలురాయిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వివిధ దేశ, విదేశీ మార్కెట్లకు ఔషధాల సరఫరా జరుగుతుంది. కొత్త ఉత్పత్తుల పరిచయానికీ ఈ ప్లాంట్ వేదిక కానున్నది’
-ఆశిష్ మహేశ్వరీ, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎండీ
హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రముఖ ఐపీఆర్ బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఓ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. రూ.85 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్పాదక కేంద్రాన్ని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూమి పూజ జరుగగా, ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సదుపాయం.. మార్చి 2024కల్లా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జూన్ నుంచి ఔషధాల సరఫరా కూడా ప్రారంభమవుతుందన్నాయి. కాగా, ఈ ప్లాంట్తో ఇప్పటికే ఉన్న మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని, ముఖ్యంగా ఐరోపా దేశాల మార్కెట్లలోకి ప్రవేశించడానికి వీలుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
400 ఉద్యోగాలు
ఈ ప్లాంట్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యూఎస్ఎఫ్డీఏ, ఈయూజీఎంపీ, డబ్ల్యూహెచ్వో జెనీ వా మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని స్పెక్ట్రం ఫార్మాటెక్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. ముంబైకి చెందిన ఈ సంస్థే ప్లాంట్ డిజైన్, ఇంజినీరింగ్ పనులను చూసుకోనున్నది. ఇక సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ సామర్థ్యం ఏటా 100 కోట్ల ట్యాబ్లెట్ల తయారీగా ఉంటుంది. అలాగే 50 కోట్ల క్యాప్సుల్స్, 2.7 కోట్ల లిక్విడ్ ఇంజెక్షన్లనూ తయారు చేయవచ్చు.