CNG Bike | పుణె, జూలై 5: ప్రపంచంలోనే తొలి కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత మోటర్సైకిల్ను ‘ఫ్రీడమ్ 125’ పేరిట భారతీయ సంస్థ బజాజ్ ఆటో ఆవిష్కరించింది. శుక్రవారం ఇక్కడ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ నయా బైక్ను పరిచయం చేశారు. అయితే తొలుత మహారాష్ట్ర, గుజరాత్ల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ టూవీలర్.. ఆ తర్వాత దేశంలోని మిగతా రాష్ర్టాల మార్కెట్లలోకి కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది. కాగా, పర్యావరణహిత వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ సందర్భంగా రాజీవ్ బజాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ను బజాజ్.. మొత్తం మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. అవే.. డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ మాడళ్లు. ఇండియా ఎక్స్షోరూం ప్రకారం ఈ బైక్ల ధరలు రూ.95,000-1,10,000 మధ్య ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ బజాజ్ షోరూంలతోపాటు సంస్థ అధికారిక వెబ్సైట్లో ఈ మోటర్సైకిల్స్ను బుక్ చేసుకోవచ్చు. ఇక 5 కలర్లలో లభించే ఈ బైక్లలో సీఎన్జీ కోసం ఒకటి, పెట్రోల్ కోసం ఇంకొకటి మొత్తం రెండు ఇంధన ట్యాంక్లున్నాయి. వీటికి వేర్వేరు స్విచ్లుంటాయి. ఏది ఆన్ చేస్తే అందులోనే బైక్ నడుస్తుంది. ఈ ప్రక్రియ ఎంతో సులభంగా ఉంటుందన్న బజాజ్.. రెండు ట్యాంక్లను ఫుల్ చేస్తే మొత్తంగా 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పేర్కొన్నది.
ఫ్రీడమ్ 125 వినియోగదారులు తమ ఇంధన ఖర్చును 50 శాతానికి తగ్గించుకోగలరని బజాజ్ చెప్తున్నది. సీఎన్జీ వాడకంతో కిలోమీటర్ ప్రయాణ ఖర్చు రూపాయి, అంతకన్నా తక్కువేనన్నది. కేవలం పెట్రోల్ ఆధారంగానే నడిచే బైక్ల ప్రయాణ ఖర్చుతో చూస్తే ఇది సగమేనని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే ఫ్రీడమ్ 125 ఓనర్లు ఇతర 125సీసీ బైక్ రైడర్లతో పోల్చితే ఐదేండ్లలో రూ.75,000 వరకు ఆదా చేసుకోవచ్చని బజాజ్ ఆటో తెలియజేసింది. ప్రస్తుతం 75 శాతానికిపైగా టూవీలర్ కస్టమర్ల ఆందోళన పెట్రోల్ ఖర్చేనని, ఫ్రీడమ్ 125 అలాంటి వారికోసమే తెచ్చామని ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఈడీ రాకేశ్ శర్మ స్పష్టం చేశారు.