న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: యోగా గురువు బాబా రామ్దేవ్..తాజాగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెక్నాలజీ సేవల సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి పతంజలి ఆయుర్వేద ఆసక్తి చూపుతున్నట్లు ఎకనమిక్స్ టైం ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. పుణెకు చెందిన ఆష్దాన్ ప్రాపర్టీస్ అత్యధిక బిడ్డింగ్ ప్రకటించిన తర్వాత పతంజలి ఆయుర్వేద సంస్థ రూ.830 కోట్ల నగదు ఆఫర్ చేసింది.
ఈ బిడ్డింగ్నకు సంబంధించి ఆఫర్ను చేర్చాలని పతంజలి ఆయుర్వేద..నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది కూడా. ఈ బిడ్డింగ్ ప్రాసెస్పై ప్యానెల్ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కమల్ సింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రోల్టా సాఫ్ట్వేర్ సర్వీసులను అందిస్తున్నది. గతేడాది జనవరిలోనే సంస్థ దివాలా ప్రకటించిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్కు రూ.7,100 కోట్లు, సిటీగ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న విదేశీ బాండ్ హోల్డర్లకు రూ.6,699 కోట్లు బకాయిపడింది. 2016లోనే విదేశీ కరెన్సీ రూపంలో తీసుకున్న రుణాల చెల్లింపుల్లో విఫలమైంది. సంస్థ మూడు సార్లు దివాలా పిటిషన్ దాఖలు చేసింది.