హైదరాబాద్, మార్చి 2: అలోపతి గత వందేండ్లుగా విశ్వవ్యాప్తమవుతున్నదని పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ అన్నారు. ‘మొక్కల నుంచి రోగులకు-వనమూలికలపై పునరాలోచన’ అనే అంశంపై పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హరిద్వార్లో నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో రామ్దేవ్ మాట్లాడుతూ ఆయుర్వేదంలో పొందుపర్చిన పరిశోధనల ఆధారంగా తాము ఔషధాల్ని ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు.
పతంజలి ఆయుర్వేద కళాశాల ద్వారా ఆయుర్వేదిక్ డాక్టర్లను తయారుచేసి, దేశ ప్రయోజనాలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రసంగిస్తూ ఆరోగ్య సేవల రంగంలో ప్రపంచమంతా పతంజలివైపు చూస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, వేదాల్లో పేర్కొన్న వైద్య పద్ధతుల్ని పునరుద్ధరించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు.