న్యూఢిల్లీ, మార్చి 16: విమాన ఇంధన ధరలు పగ్గాలు లేకుండా దూసుకుపోతున్నది. గత కొన్ని నెలలుగా అధికమవుతూ వచ్చిన జెట్ ఫ్యూయల్ ధర ఆల్టైం హైకీ చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికమవడంతో దేశీయంగా జెట్ ఫ్యూయల్ ధరలను మరో 18 శాతం పెంచాయి ఇంధన విక్రయ సంస్థలు. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు ఆరుసార్లు అధికమవడంతో కిలో లీటర్ ధర లక్ష రూపాయలు అధిగమించింది. ఈ రికార్డుకు చేరుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కిలో లీటర్ ధరను రూ.17,135.63 లేదా 18.3 శాతం పెంచడంతో కిలో లీటర్ ధర రూ.1,10, 666.29 పలికింది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకొకసారి దేశీయ ఇంధన విక్రయ సంస్థలు తమ ధరలను మారుస్తుంటాయి.
మరోమారు టిక్కెట్టు ధరల మోత ఇంధన ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో మరోమారు విమానయాన సంస్థలు తమ టిక్కెట్టు ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు పెంచిన సంస్థలు..ఈసారి మాత్రం భారీగా పెంచనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గత వారంలో గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 14 ఏండ్ల గరిష్ఠ స్థాయి 140 డాలరు పలికినప్పటి, ప్రస్తుతం 100 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. విమానయాన సంస్థల నిర్వహణలో 40 శాతం ఇంధనానికి ఖర్చు అవుతుండటంతో సంస్థలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నది. ఆగస్టు 2008లో బ్యారెల్ క్రూడాయిల్ ధర రికార్డు స్థాయి 147 డాలర్లు పలికినప్పుడు కిలో లీటర్ ధర రూ.71,028.26 స్థాయిలో ఉన్నది. జనవరి నుంచి ఇప్పటి వరకు జెట్ ఫ్యూయల్ ధర రూ.36,643.88 పెరిగింది. ఇంచుమించు 50 శాతాని కంటే అధికం. నవంబర్ 4, 2021న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు..ఐదు రాష్ర్టాల ఎన్నికలు ఉండటంతో గడిచిన ఐదు నెలలుగా ధరలను యథాతథంగా ఉంచాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67గా ఉన్నది.