Cars Sales | న్యూ మోడల్ కార్ల ఆవిష్కరణలు, సెమీ కండక్టర్ చిప్ల సరఫరాలో పురోగతి నేపథ్యంలో 2022 జూన్తో పోలిస్తే 2023 జూన్ నెలలో కార్ల విక్రయాలు స్వల్పంగా పెరిగాయి. గత నెలలో 3.27 లక్షల కార్లు అమ్ముడు కాగా, గతేడాది 3.21 లక్షలకు మాత్రమే పరిమితమయ్యాయి. అంటే 2022తో పోలిస్తే దాదాపు రెండు శాతం సేల్స్ పెరిగాయి. కానీ గత మే నెల విక్రయాలతో పోలిస్తే రెండు శాతం కార్ల విక్రయాలు పడిపోయాయి. 3.35 లక్షల యూనిట్ల కార్ల విక్రయాలతో ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే ఆల్ టైం హై రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే, కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన రెండో దశ బీఎస్-6 ప్రమాణాల అమలు దీనికి కారణమా.. బీఎస్-6 2.0 ప్రమాణాలకు అనుగుణంగా కార్లలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) అమర్చడం వల్లే వాటి ధరలు పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో కాస్త కార్ల కొనుగోలు దారులు ఆచితూచి స్పందిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
2022తో పోలిస్తే 2023 తొలి అర్థ భాగం (జనవరి -జూన్)లో కార్ల విక్రయాల్లో 10 శాతం గ్రోత్ నమోదైంది. 2022 తొలి ఆరు నెలల్లో 18.31 లక్షల పై చిలుకు కార్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది 20 లక్షల మార్కును దాటేశాయి. త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్ కోసం మారుతి సుజుకి సహా కార్ల తయారీ సంస్థలు కొత్త మోడల్ కార్లను మార్కెట్లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే మారుతి సుజుకి.. జిమ్నీ, ఫ్రాంక్స్ ఆవిష్కరించింది. ఇక మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) ఇన్ విక్టో బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎస్యూవీ ఎక్స్టర్ ఈ వారంలో ఆవిష్కరిస్తుంది. మంగళవారం కియా తన సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించింది. అదే బాటలో పయనిస్తున్న హోండా తన ఎస్యూవీ కారు ఎలివేట్నూ ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
కానీ గత నెలలో టాప్-3 కార్ల తయారీ సంస్థలు కూడా దేశీయ విక్రయాల్లో సింగిల్ డిజిట్ గ్రోత్కి మాత్రమే పరిమితం అయ్యాయి. మారుతి సుజుకి తన యుటిలిటీ వెహికల్స్ (యూవీ) విభాగం మోడల్స్ బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 సేల్స్ రెండింతలు అయ్యాయి. 2022లో 18,860 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 43,404 యూనిట్లకు పెరిగాయి.
మినీ కార్ల క్యాటగిరీలో ఆల్టో, ఎస్-ప్రెస్సో స్వల్పంగా 14,442 యూనిట్ల నుంచి 14,054 యూనిట్లకు పడిపోయాయి. కంపాక్ట్ మోడల్ కార్లు బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగన్-ఆర్ సేల్స్ కూడా 17 శాతం తగ్గి 77,746 యూనిట్ల నుంచి 64,471 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ తమ వెర్నా, క్రెటా, టస్కన్ మోడల్ కార్లు వాటి సెగ్మెంట్లలో లీడర్లుగా కొనసాగాయన్నారు. టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ప్రత్యేకించి ఫెస్టివ్ సీజన్లో డిమాండ్ యధాతథంగా కొనసాగుతుందన్నారు. ఎస్యూవీ కార్లకు డిమాండ్ యథాతథంగా కొనసాగుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు.
గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి గత నెలలో ఎనిమిది శాతం విక్రయాలు పెంచుకుంటే.. రెండో స్థానంలో ఉన్న హ్యుండాయ్ రెండు శాతం, తర్వాతీ స్థానాల్లో ఉన్న టాటా మోటార్స్ ఐదు శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 21 శాతం సేల్స్ పెంచుకున్నాయి.