Car Sales in Navratri | రెండేండ్ల విరామం తర్వాత ఆటోమొబైల్ సంస్థలకు ఈ ఏడాది పండుగ సీజన్ సంతోషాలను తెచ్చి పెట్టింది. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో కార్లు, మోటార్ బైక్స్, స్కూటర్ల విక్రయాలు ఆటోమొబైల్ సంస్థలకు ఊపునిచ్చాయి. 10 రోజుల పాటు సాగిన ఈ సేల్స్లో అత్యధికం సెడాన్లు, ఎస్యూవీ మోడల్ కార్లే అమ్ముడయ్యాయి. గత 12 నెలల్లో రెట్టింపు స్థాయిలో సెడాన్ కార్లు, ఎస్యూవీలను వినియోగదారులు సొంతం చేసుకున్నారు. గత ఐదేండ్లలో ఎన్నడూ లేని విధంగా అమ్ముడైన కార్లలో 1.25 నుంచి 1.30 లక్షల వరకు సెడాన్లు.. ఎస్యూవీలే..
మారుతి సుజుకి కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన బ్రిజా, గ్రాండ్ విటారా నుంచి హ్యుండాయ్ ఆల్ న్యూ వెన్యూ.. మహీంద్రా న్యూ స్కార్పియో, టాటా నెక్సాన్, టాటా పంచ్ వేరియంట్ కార్లే అత్యధికం అమ్ముడయ్యాయి. గత 12 నెలల్లో 1.70 లక్షల కార్లు విక్రయించిన ఆటోమొబైల్స్.. 2021లో 78 వేల యూనిట్లు మాత్రమే విక్రయించగలిగాయి. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో టూ వీలర్స్ సేల్స్ పెరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో 30 శాతం బైక్లు, స్కూటర్లు అమ్ముడు పోయాయి.
మారుతి సుజుకి నవరాత్రుల సందర్భంగా 80 వేలకు పైగా కార్లు విక్రయించింది. ఏడాది క్రితం కేవలం 36 వేల కార్లు మాత్రమే సేల్ చేయగలిగింది. గతేడాది సెమీ కండక్టర్ల కొరత కూడా అమ్మకాలు దెబ్బతినడానికి కారణం అని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ఇప్పటికీ కార్ల బుకింగ్స్ 8.50 లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. అందులో మారుతి సుజుకి వద్ద పెండింగ్లో నాలుగు లక్షలకు పైగా బుకింగ్స్ నమోదు కావడం గమనార్హం.
ఇటీవల కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి తేవడంతో డిమాండ్ను అందుకోగలిగామని హ్యుండాయ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే 38.5 శాతం డిమాండ్ పెరిగిందన్నారు. నవరాత్రి నుంచి దీపావళి వరకు కార్ల సేల్స్.. గత దశాబ్దిలోనే బెస్ట్ రికార్డు నెలకొల్పుతాయని అంచనా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెహికల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా చెప్పారు.