హైదరాబాద్, జనవరి 11: హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా తన ఇంజెక్టబుల్ వ్యాపారంలో కొంత వాటాను విక్రయించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఈ వ్యాపారంలో 30-35 శాతం వాటాను రూ. 4,500-5,250 కోట్లకు (600-700 మిలియన్ డాలర్లు) విక్రయించాలని కంపెనీ భావిస్తున్నట్లు ఈ డీల్ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కంపెనీ ఇంజెక్టబుల్ వ్యాపారం విలువ రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 35 శాతం వాటా విక్రయించడానికి పలు పీఈ ఫండ్స్తో కంపెనీ చర్చలు ప్రారంభించిందని, టీపీజీ క్యాపిటల్ మేనేజ్మెంట్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్స్టోన్, కార్లే గ్రూప్, పీఏజీలు ఈ లావాదేవీపై ఆసక్తి కనపరుస్తున్నట్లు సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ ఎకనామిక్టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అరబిందో 105 మిలియన్ డాలర్ల ఇంజెక్టబుల్స్ను విక్రయించింది. 2024కల్లా వీటి అమ్మకాల్ని 700 మిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యం. ఇంజెక్టబుల్ వ్యాపారాన్ని విస్తరించేదిశగా యూరోపియన్ యూనియన్ దేశాలకు, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వైజాగ్లో కంపెనీ ఒక ఇంజెక్టబుల్ ప్లాంట్ నెలకొల్పుతున్నది. ఈ ప్లాంట్ నుంచి వాణిజ్య ఉత్పత్తి వచ్చే 15-18 నెలల్లో మొదలవుతుందని అంచనా. మరోవైపు అమెరికాలో ఇంజెక్ట్బుల్ ప్లాంట్ నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది. జెనెరిక్ ఇంజెక్టబుల్స్, అప్థాల్మిక్స్ను తయారు చేసే ఒక యూనిట్ను తన సబ్సిడరీ కంపెనీ యుజియా ఫార్మా స్పెషాలిటీస్కు గతేడాది రూ.876 కోట్ల విలువతో బదిలీ చేసింది. అరబిందో మొత్తం ఇంజెక్టబుల్ వ్యాపారానికి విలువకు బెంచ్మార్క్గా ఈ బదిలీ జరిగిందని విశ్లేషకులు చెపుతున్నారు. రామ్ప్రసాద్ రెడ్డి, నిత్యానంద రెడ్డి ప్రమోట్ చేసిన అరబిందో ఫార్మాకు ప్రస్తుతం 14 ఫార్ములేషన్ ఉత్పత్తి ప్లాంట్లు, 11 ఏపీఐ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.