న్యూఢిల్లీ, అక్టోబర్ 4: గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ఎగుమతుల్లో మళ్లీ నిస్తేజం ఆవహరించింది. ఇంజినీరింగ్, రెడీ-మేడ్ గార్మెంట్స్, బియ్యం ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగా మొత్తం ఎగుమతులు 3.52 శాతం తగ్గి 32.62 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, భారత్ 59.35 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతైన 56.29 బిలియన్ డాలర్లతో పోలిస్తే 5.44 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు-దిగుమతులు మధ్య వ్యత్యాసం) రికార్డు స్థాయికి చేరుకున్నది. గత నెలకుగాను లోటు 26.72 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కెమికల్స్, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్ వంటి ఉత్పత్తుల ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, క్రూడాయిల్ దిగుమతులు 16.8 బిలియన్ డాలర్ల నుంచి 15.6 బిలియన్ డాలర్లకు దిగిరాగా, అలాగే పసిడి దిగుమతులు 5.11 బిలియన్ డాలర్ల నుంచి 3.65 బిలియన్ డాలర్లకు దిగొచ్చినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కెమికల్స్ దిగుమతులు 2.48బిలియన్ డాలర్ల నుంచి 2.42 బిలియన్ డాలర్లకు దిగిరాగా, వంటనూనెలు కూడా 2 బిలియన్ డాలర్ల నుంచి 1.9 బిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ..బొగ్గు,కోక్, బ్రికేట్లు దిగుమతి 3.43 బిలియన్ డాలర్లకు పెరగడం వల్లనే వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకున్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ లేకపోవడంతో గత నెలకుగాను 7.81 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది 9.41 బిలియన్ డాలర్లుగా ఉన్నది. బియ్యం ఎగుమతులు కూడా 779 మిలియన్ డాలర్ల నుంచి 733.33 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
తొలి ఆరు నెలల్లోనూ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకున్నది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి 229.05 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇదే సమయంలో దిగుమతులు 37.89 శాతం ఎగబాకి 378.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు రెండు రెట్లు పెరిగి 76.25 బిలియన్ డాలర్ల నుంచి 149.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్యంలో మందకొడి పరిస్థితులతోనే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం, కరెన్సీలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కూడా ఇందుకు కారణం. పలు కమోడిటీ ఉత్పత్తుల ధరలు తగ్గడం, పలు ఉత్పత్తులపై నిషేధం విధించడం కూడా ప్రభావం చూపాయి.
– అజయ్ సహాయ్,ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్