LIC Attention | ఎల్ఐసీ పాలసీ దారులకు అటెన్షన్. ఒకవేళ మీరు ఎల్ఐసీలో తీసుకున్న పాలసీ ల్యాప్స్ (మురిగిపోయినా) అయినా, తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. అందుకోసం ఎల్ఐసీ మీకు మరో అవకాశం కల్పించింది. చౌకగా పాలసీలను పునరుద్ధరించుకునేందుకు గత నెల ఏడో తేదీ నుంచి ఎల్ఐసీ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. ఈ నెల 25తో ఎల్ఐసీ చేపట్టిన ప్రత్యేక క్యాంపెయిన్ ముగియనున్నది.
అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించలేకపోయిన వారికి బెనిఫిట్ కల్పించేందుకు ఈ పునరుద్ధరణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో రిస్క్ కవరేజీ కొనసాగేందుకు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి పాలసీ దారులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయిన తేదీ నుంచి ఐదేండ్లలోపు కొన్ని షరతులకు లోబడి ఈ అవకాశం కల్పిస్తున్నది. ఈ ప్రత్యేక పునరుద్ధరణ క్యాంపెయిన్లో కొన్ని అర్హమైన ప్లాన్లు గల పాలసీలకు లేట్ ఫీజుతో ప్రీమియం చెల్లింపునకు చోటు కల్పించింది. అయితే టర్మ్ అస్సూరెన్స్ అండ్ మల్టీపుల్ రిస్క్ పాలసీలకు మాత్రం ఈ మినహాయింపులు వర్తించవు.
పాలసీదారులకు రక్షణ కల్పించేందుకు వెసులుబాటు కొనసాగించాలని ఎల్ఐసీ నిర్ణయించింది. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో పాలసీదారులు మరణిస్తే, వారికి వారి కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి లైఫ్ కవరేజీ కొనసాగించడానికి పాలసీదారులు తమ పాలసీలు పునరుద్ధరించుకోవచ్చు.