Atta-Bakery & Bread Costly | బ్రెడ్, బిస్కెట్లు, ఇతర బేకరీ ఫుడ్ కాస్ట్లీ కానున్నాయి. ఇండియన్ కిచెన్లో నిత్యం వాడే ఆహార పదార్థం గోధుమ పిండి లేదా ఆటా.. దీని ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దశాబ్ధి గరిష్టానికి దూసుకెళ్లింది. సగటున కిలో గోధుమ పిండి ధర రిటైల్ మార్కెట్లో రూ.32.38 పలుకుతున్నది. ఇది 2010 జనవరి తర్వాత అత్యధికం. రాష్ట్ర పౌర సరఫరాల విభాగాలు మొదలు కేంద్ర ఆహారం-ప్రజా పంపిణీ- వినియోగ వ్యవహారాల శాఖ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం శనివారం దేశంలో సగటున కిలో గోధుమ పిండి రూ.32.78 తున్నది. ఏడాది కాలంలో కిలో గోధుమ పిండి ధర 9.15 శాతం పెరిగింది. సరిగ్గా ఏడాది క్రితం కిలో ఆటా పిండి ధర రూ.30.03 అయితే, ఇప్పుడు రూ.32.78కి దూసుకెళ్లింది. దేశంలోని 156 కేంద్రాల్లో లభ్యమైన ధరల ప్రకారం పోర్ట్బ్లయర్లో గోధుమ పిండి కిలో ధర సగటున గరిష్ఠంగా రూ.59 అయితే, పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో రూ.22లకే లభ్యం అవుతున్నది.
దేశంలో గోధుమల దిగుబడితోపాటు నిల్వలు పడిపోవడం కూడా ఆటా పిండి ధర పెరుగుదలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి గోధుమ పిండికి గిరాకీ పెరగడమూ మరో కారణం అంటున్నారు. దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో గరిష్ఠంగా ముంబైకర్లు రూ.49లకు కిలో గోధుమ పిండి కొంటున్నారు. చెన్నైలో కిలో ఆటా పిండి రూ.34 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ వాసులకు మాత్రం కాస్త రిలీఫ్గా ఉంది. ఢిల్లీలో కిలో గోధుమ పిండి రూ.27లకు లభిస్తున్నది.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి గోధుమ పిండి ధర 5.81 శాతం పెరిగిపోయింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా గోధుమ పిండి ధర పెరుగుదలకు మరో కారణం అని తెలుస్తున్నది. ప్రపంచ దేశాలకు గోధుమల ఎగుమతిలో ఉక్రెయిన్-రష్యాల వాటా 25 శాతం ఉంటుంది.
గోధుమ పిండి ధరతోపాటు బేకరీ ఉత్పత్తులు, బిస్కట్లు, బ్రెడ్ ధరలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. గత మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.39 శాతంగా నమోదైంది. గత ఏడేండ్లలో ఇదే గరిష్ఠం. బ్రిటానియా తన జామ్ జామ్ బిస్కట్లు, మేరీ గోల్డ్, న్యూట్రీ చాయిస్, ఫ్రూట్ కేక్స్ తదితర పదార్థాల ధరలు త్వరలో 10 శాతం పెంచనున్నది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 10 శాతం ధరలు పెంచేసింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో గోధుమ పిండి, చక్కెర, జీడిపప్పు ధరలు భారీగా పెరిగాయని బ్రిటానియా ఎండీ వరుణ్ బెర్రీ తెలిపారు.