న్యూఢిల్లీ : ఏటీఎం ( ATM ) లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజులూ ఆదివారం నుంచే పెరిగాయి. రూ.15 నుంచి 17కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లావాదేవీలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంక్ల ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసినప్పుడు సదరు కస్టమర్ల నుంచి బ్యాంక్లు ఈ ఫీజులను వసూలు చేస్తాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ఆగస్టు 1 నుంచే నగదు లావాదేవీలపై పరిమితులను సవరించింది. తమ దేశీయ సేవింగ్స్ ఖాతాదారుల ఏటీఎం ఇంటర్చేంజ్, చెక్బుక్ చార్జీల్లోనూ మార్పులు చేసింది. మెట్రో నగరాల్లో మూడు, ఇతర నగరాల్లో ఐదు చొప్పున ఉచిత లావాదేవీలను ఖాతాదారులు పొందవచ్చని, ఆ తర్వాత ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.5 చొప్పున చార్జీలుంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది.