ATF Price Hike | విమాన ఇంధన ధరలు భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా కేంద్రం జెట్ ఫ్యూయల్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్- ఏటీఎఫ్) ధరలు బుధవారం 18.3 శాతం పెంచేసింది. ఏటీఎఫ్ ధరలు పెంచడం ఈ ఏడాదిలో వరుసగా ఆరోసారి. ఆల్టైం రికార్డు కూడా. కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.లక్షను దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ17,135.63 (18.3 శాతం) పెంచడంతో రూ.1,10,666.29లకు చేరుకున్నది.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గతవారం బ్యారెల్పై 140 డాలర్లకు చేరువయ్యాయి. రష్యా నుంచి ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళన మధ్య ధరలు పెరిగిపోయాయి. ఇది 14 ఏండ్ల గరిష్ఠ స్థాయి. తిరిగి ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది.
ముంబైలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.109,119.83, కోల్కతాలో రూ. 114,979.70, చెన్నైలో రూ.114,133.73లకు చేరుకున్నది. విమాన సర్వీసుల నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం జెట్ ఫ్యూయల్కే ఖర్చవుతుంది. ఈ ఏడాది నూతన రికార్డులకు చేరుకోనున్నది. 2008 ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 147 డాలర్లు ఉన్నప్పుడు కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.71,028.26గా ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి ఏటీఎఫ్ ధరలు ప్రతి 15 రోజులకోసారి పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏటీఎఫ్ ధర దాదాపు 50 శాతం పెరిగి రూ.36,643.88 లకు చేరింది. ఫలితంగా విమానయాన సంస్థలు ఏటీఎఫ్ భారాన్ని ప్రయాణికులపై మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి.