ఏడాదిలో లక్షన్నర కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నది మోదీ సర్కారు.గడిచిన దాదాపు 8 నెలల్లో రూ.33వేల కోట్లకుపైగా ఆస్తులను విక్రయించింది కూడా. ఇందులో సగం ఆస్తులు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందినవే.రాబోయే 4 నెలలకుపైగా కాలంలో ఎలాగైనా ఇంకో లక్ష కోట్ల ఆస్తులనైనా అమ్మేయాలన్న పట్టుదలతో ఆయా శాఖల అధికారులు కసరత్తులు చేస్తున్నారిప్పుడు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: అందినకాడికి అమ్ముకుందాం.. దొరికినకాడికి దోచుకుం దాం.. అన్నరీతిలో ముందుకెళ్తున్న మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఏ ఒక్క ఆస్తినీ విడిచి పెట్టడం లేదు. ఈ క్రమంలోనే తాము రూపొందించిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల ప్రథమార్ధం దాకా రూ.33,422 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది. ఇందులో బొగ్గు శాఖకు చెందినవే రూ.17,000 కోట్లు కావడం గమనార్హం. ఇక పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తమకు అప్పగించిన లక్ష్యాన్ని ఎప్పుడో చేరుకోవడం నిజంగా విశేషమే.
రూ.38వేల కోట్లు తగ్గవచ్చని..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభు త్వ ఆస్తుల నగదీకరణ కింద రూ. 1,62,422 కోట్లు సమీకరించాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి రూ.1,24,179 కోట్ల సమీకరణే సాధ్యమన్న అంచనాలున్నాయి. దీంతో అసలు లక్ష్యానికి రూ.38,243 కోట్లు తగ్గుతాయని అంటున్నారు. ఈ నెల 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ఎంపీ ప్రగతిపై సమావేశమయ్యారు. ఇందులోనే ఈ నిధుల సమీకరణ లక్ష్య సాధన కష్టమన్న అభిప్రాయాలు నీతి ఆయోగ్ నుంచి వెళ్లినట్టు తెలుస్తున్నది.
ఏయే రంగాల్లో..
బొగ్గు, గనులు, ఓడరేవులు, రోడ్డు రవాణా, విద్యుత్తు, రైల్వేలు, విమానయానం, చమురు, గ్యాస్ రంగాలను ఆస్తుల నగదీకరణకు నరేంద్ర మోదీ సర్కారు ప్రధానంగా ఎంచుకున్నది. వీటిలో బొగ్గు, గనులు, పోర్టు-షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఇక రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యానికి కొద్దిదూరంలో ఆగిపోవచ్చన్న అభిప్రాయాలు ఇటీవలి సమీక్షలో నీతి ఆయోగ్ నుంచి వినిపించాయి. కానీ విద్యుత్తు, రైల్వేలు, పౌర విమానయానం, చమురు-గ్యాస్ రంగాల్లో లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలో అమ్ముకోదగిన ఆస్తులను గుర్తించాలని ఆయా మంత్రిత్వ శాఖలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్టాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా మోదీ సర్కారు సూచిస్తున్నది.
ఏమిటీ ఎన్ఎంపీ?
ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ)ను నీతి ఆయోగ్ రూపొందించింది. ఆస్తుల నగదీకరణ కోసం గత ఆర్థిక సంవత్సరం (2021-22) కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రకటించారు. 2021-22 నుంచి 2024-25 వరకు నాలుగేండ్లలో దాదాపు రూ.6 లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయమే దీని లక్ష్యం. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలూ వెళ్లాయి. వీరంతా ఆయా ఆస్తులను అమ్మకానికి సిద్ధం చేసే పనిలోనే ఇప్పుడు నిమగ్నమయ్యారు.