హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ చేతులు మారుతున్నది. సంస్థలో ఇప్పటికే కొంతమేర వాటా కొనుగోలు చేసిన ఏషియా హెల్త్కేర్ హోల్డింగ్స్(ఏహెచ్హెచ్) మెజార్టీ వాటాను కొనుగోలుచేసినట్టు బుధవారం ప్రకటించింది. యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సను అందించడానికి హైదరాబాద్తోపాటు వైజాగ్, సిలిగురి, చెన్నైలలో ఏడు హాస్పిటల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ఏడు ఆసుపత్రుల్లో 500 పడకలు, 4 లక్షల మంది రోగులకు చికిత్సను కూడా అందించింది. అలాగే వెయ్యి రోబోటిక్ యూరాలజీ సర్జరీలు నిర్వహించింది కూడా.
ఈ సందర్భంగా ఏహెచ్హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ బాలీ మాట్లాడుతూ..యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో పేరేన్నిక కలిగిన ఏఐఎన్యూ మెజార్టీ వాటాను కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉన్నది, దేశంలో సింగిల్ స్పెషాల్టీ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కొనుగోలు దోహదం చేయనున్నదన్నారు. భవిష్యత్తులో రూ.600 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. భారతీయులకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో ఎక్కువ మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, అలాగే కేన్సర్ రహిత ప్రోస్టేట్ ఎన్లార్జిమెంట్ వ్యాధులతో ఎక్కువ మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి, వీటిని నియంత్రించాలనే ఉద్దేశంతో 2013లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టు ఏఐఎన్యూ ఎండీ సీ మల్లికార్జున తెలిపారు.