హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేసిన ఓ కంపెనీ నిర్వాకాన్ని వాణిజ్య పన్నుల శాఖ బట్టబయలు చేసింది. తప్పుడు వివరాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ సంబంధించి ఏఎస్ మెటో కార్పొరేషన్ సంస్థ రూ.5.89 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి మంగళవారం వెల్లడించారు. సికింద్రాబాద్కు చెందిన ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం కలిగిందని, గతేడాది డిసెంబర్ 24, 26 తేదీల్లో ఆ కంపెనీ సీఈవో పీయూష్ ప్రవీణ్ చంద్ర మెహతా నివాసంలో సోదాలు నిర్వహించామని వివరించారు.
మే 2018 నుంచి అక్టోబర్ 2022 వరకు ఎంఎస్ పైపులు, టీఎంటీ బార్లు, టీఎంటీ రెబర్లు, సీఆర్ఎఫ్హెచ్ స్టీల్ కాయిల్స్ సరఫరా చేసినట్టు ఈ-వే బిల్లులు, ఇన్వాయిస్లు ఉన్నాయని, కానీ అందులో స్పష్టత లేదన్నారు. దీంతో ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) టెక్నాలజీ సహాయంతో పరిశీలించగా.. వస్తువుల ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లుల ప్రకారం ఎక్కడా టోల్ప్లాజాలు, రింగ్రోడ్డులు దాటలేదని చెప్పారు.
తప్పుడు వివరాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. వస్తువులను ఎగుమతి చేసుకోకపోయినా చేసుకున్నట్టు తప్పుడు ఐటీసీని క్లెయిమ్ చేశారన్నారు. సరుకు రవాణా కోసం వినియోగించే వాహనాల స్థానంలో కార్లు, ప్యాసింజర్ ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాల నంబర్లతో తప్పు డు ఇన్వాయిస్లు సృష్టించారని తెలిపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 26న కంపెనీ సీఈవో పీయూష్పై వాణిజ్య పన్నుల శాఖ బేగంపేట డిప్యూటీ కమిషనర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టు శ్రీదేవి తెలిపారు.