BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ కంపెనీలు భారత్ నుంచి పెద్దయెత్తున వెళ్లిపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసంబంద్ధ నిర్ణయాలు, ఏకపక్ష విధానాలు, రాజకీయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణంగా పారిశ్రామిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్లో సెమీ కండక్టర్, డిస్ప్లే తయారీ ప్లాంట్ను నెలకొల్పేందుకు వేదాంత గ్రూప్తో కలిసి ముందుకొచ్చిన తైవాన్కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ ఆ జాయింట్ వెంచర్కు గుడ్బై చెప్పడం, దీని వెనుక కేంద్రం ఒత్తిళ్లే కారణమని వార్తలు రావడం మరోసారి చర్చనీయాంశమైంది.
తొమ్మిదేండ్ల బీజేపీ హయాంలో 950కిపైగా విదేశీ కంపెనీలు భారత్లో తమ ‘ప్లేస్ ఆఫ్ బిజినెస్’ను మూసేసినట్టు సమాచారం. ఈ లెక్కన వారానికి సగటున రెండు గ్లోబల్ సంస్థలు ఇండియాలో తమ కార్యకలాపాలకు స్వస్తిపలికినట్టు అర్థమవుతున్నది. కేంద్రం ఏకపక్ష విధానాలను నిరసిస్తూ భారత్ నుంచి శాశ్వతంగా వైదొలగాలని నిర్ణయించుకొన్నట్టు గత ఏడాది అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈవీల తయారీ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. అమెరికా లగ్జరీ బైక్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్, జనరల్ మోటార్స్, వీపీఎన్ సర్వీసు కంపెనీలు ఎక్స్ప్రెస్ వీపీఎన్, సర్ఫ్షార్క్ తదితర అంతర్జాతీయ కంపెనీలు తాము భారత్లో కొనసాగబోమని తేల్చిచెప్పాయి. ఇక బీజేపీ హయాంలో దేశీయ పరిశ్రమలకు కూడా గడ్డు పరిస్థితులే మిగిలాయి. 9 ఏండ్లకాలంలో ఏకంగా 10 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు మూతపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోని మోదీ.. కనీసం ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని ఉద్దీపన ప్యాకేజీగా అందిస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. కాగా, మూతపడిన రిజిస్టర్డ్ కంపెనీలలో అత్యధికం సేవల రంగానివే. సర్వీస్ సెక్టార్లో 28 శాతం, తయారీలో 24 శాతం, ట్రేడింగ్లో 11 శాతం, నిర్మాణంలో 10 శాతం కంపెనీలు మూతబడ్డాయి. ఇతర రంగాల్లో మరో 27 శాతం వరకు ఉన్నాయి.
వేదాంతతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన చిప్ తయారీ జాయింట్ వెంచర్కు సోమవారం గుడ్బై చెప్పిన ఫాక్స్కాన్.. మంగళవారం కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. మరో కంపెనీతో జట్టుకట్టే దిశగా వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే సెమీకండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ ప్రోగ్రామ్ కింద చిప్ తయారీ ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టూ ఈ తైవాన్ దిగ్గజ సంస్థ ప్రకటించింది. ఓ కాంట్రాక్ట్ తయారీదారుగా భారత్కు ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్న ఫాక్స్కాన్.. సరైన భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వేదాంతతో కలిసి చేపట్టిన చిప్ తయారీ ప్రాజెక్టు.. అనుకున్నంత స్థాయిలో పురోగమించడం లేదని, ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించలేకే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఫాక్స్కాన్ చెప్తున్న విషయం తెలిసిందే.
కేంద్రం అసంబంద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ దేశం నుంచి ఒకవైపు విదేశీ పరిశ్రమలు బయటకు వెళ్తుండగా.. తెలంగాణకు మాత్రం కంపెనీలు వరుసకడుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కే చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ పారిశ్రామిక రంగ ముఖచిత్రమే మారిపోయిందని చెప్పాలి. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచాలన్న ఉద్దేశంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2015లో టీఎస్ఐపాస్ను తీసుకొచ్చింది. దీంతో ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణవైపు చూడటం ప్రారంభించాయి. పారిశ్రామిక విధానానికి తెలంగాణ అనుకూలంగా ఉండటంతో గడిచిన 9 ఏండ్లలో రాష్ట్రంలో 23 వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తద్వారా రూ.2.62 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 17 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2014-23 మధ్య పరిశ్రమల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 28,500 ఎకరాల భూమిని కేటాయించి అభివృద్ధి చేయడంతో అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేశాయి.
దాదాపు 10 లక్షల కంపెనీలకు తాళం
దేశం విడిచి వెళ్లిపోయిన 950 విదేశీ కంపెనీలు
ఉద్యోగాలులేక రోడ్డునపడ్డ 22 కోట్ల మంది యువత
23 వేల కొత్త పరిశ్రమల ఏర్పాటు
అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల రాక
రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల మందికి ఉపాధి అవకాశాలు