Finance Planing | నాలుగేండ్ల క్రితం వెలుగు చూసిన కొవిడ్-19 మహమ్మారి ఎంతోమంది సన్నిహితులను, కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను దూరం చేసింది. ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచే వారు లేక వేల కుటుంబాలు కష్టాల కడలిలో చిక్కుకున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవడం చాలా కీలకం. విశ్వమారి బారీన పడి ప్రాణాలు కోల్పోయిన వారిలో అనేక మంది తమ ఆర్థిక లావాదేవీల విషయాలు సీక్రెట్గా ఉంచడం ప్రధాన సమస్యగా మారింది.
కుటుంబ యజమాని నిర్వహించే బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నాయి.. ఎక్కడెక్కడ పొదుపు చేశారు.. ఏయే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారనే విషయాలు చాలా మంది తమ కుటుంబ సభ్యులకు తెలియనివ్వకుండా దాచి పెడుతున్నారు. ఇటువంటి ఘటనలు విశ్వమారి ఉధృత రూపం ప్రదర్శించినప్పుడు బోలెడు బయట పడ్డాయి. అప్పటికే కుటుంబానికి ఎంతో కావాల్సిన వారు, కుటుంబ సభ్యుల అవసరాలన్నీ తీర్చేవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో చిక్కుకున్న వారికి ఆర్థిక సమస్యలు తలెత్తితే ఆ కష్టం.. ఆ సమస్య ఎంత భారమో మాటలతో చెప్పాల్సిన పని లేదు. అవన్నీ తవ్వి తీయడం కూడా ఒక భారం.. దురదృష్టవశాత్తు దూరమైనా కీలక ఆర్థిక వివరాలు తెలుసుకునే వెసులుబాట్లు కుటుంబానికి కలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
భార్యా పిల్లలు, తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు.. అన్నదమ్ములు, తల్లిదండ్రులు.. కుటుంబాల్లో ఎవరో ఒకరికి ఆర్థిక అంశాలను తెలియజేయాలి. బ్యాంకుల్లో ఖాతాలు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీలు, అప్పులు, బకాయిలు తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. అవి మరొకరి చేతుల్లోకి వెళ్లే ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలి.
2019 మార్చి నెలాఖరు నాటికి ఆర్బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్నెస్ ఫండ్లో రూ.25 వేల కోట్ల నిధులు ఉన్నాయి. సుమారు పదేండ్లుగా వీటి కోసం ఎవరూ క్లయిమ్ చేయలేదు. ఇప్పటికే ఈ మొత్తం ఆయా కుటుంబాలకు చేరాల్సింది. కానీ.. ఆయా కుటుంబాల సభ్యులకు ఈ సంగతి తెలియకే నిధులు పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక దురదృష్టవశాత్తు కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వివరాలు ఎవరో ఒకరికి తెలియాలి.
ప్రతి సేవింగ్స్, మదుపు ఖాతాలకు తప్పనిసరిగా నామినీ పేరు చేర్చాలి. ఇప్పటికీ చేర్చకపోతే వెంటనే ఆయా పథకాలకు నామినీని ఎంపిక చేయండి. తమ ఆర్థిక లావాదేవీలు, పథకాలు, ఖాతాల్లో నామినీలుగా కుటుంబ సభ్యులనే ఎంచుకోవడం బెటర్. కష్టకాలంలో వారే సదరు ఖాతాలు, పెట్టుబడులు, మదుపు పథకాల్లో రిటర్న్స్కు సంరక్షకులు అవుతారు. నామినీలు చట్టబద్ధమైన వారసులైతే వారికి ఆస్తులు, ఖాతాలు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. సమస్యలు తలెత్తవు. కనుక నామినీలను ఎంపిక చేసే అంశంలో ఆచితూచి జాగ్రత్తగా ముందుకెళ్లాలి. లేకపోతే చట్టపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పలువురు తమ వీలునామాను నిర్లక్ష్యం చేస్తారు. కానీ కొవిడ్-19.. ఈ వీలునామా ప్రాధాన్యం ఏమిటో తెలియజేసింది. వారసుల మధ్య తగవులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. ఎవరెవరికి ఏ ఆస్తి, ఎంత వాటా చెందుతుందో ముందే నిర్ణయిస్తే బెటర్. అంతేకాదు వీలునామా రిజిస్టర్ చేయాల్సిందే. ఆస్తుల కేటాయింపుల్లో గొడవలు వచ్చి కోర్టు మెట్లెక్కితే రిజిస్టర్డ్ వీలునామా ప్రామాణికం అవుతుంది. కనుక లాయర్లను సంప్రదిస్తే మరింత క్లారిటీ వస్తది.
చాలామంది కీలక డాక్యుమెంట్లు, బంగారం, మనీ, ఆస్తి పత్రాలు బ్యాంకు లాకర్లలో భద్ర పరుస్తారు. ఒకవేళ లాకర్ ఖాతా ఒకరి పేరు ఉండొచ్చు. వారు మరణిస్తే డెత్ సర్టిఫికెట్ సమర్పించి, నామినీలు, వారి చట్టబద్ధ వారసులు ఆ లాకర్లు హ్యాండోవర్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్స్ ఉంటే.. ఖాతా తెరిస్తే యాక్సెస్ అనే ఆప్షన్ వద్ద ఎయిదర్ ఆర్ సర్వైవర్ అనే ఆప్షన ఎంచుకోవాలి. ఉమ్మడి అకౌంట్ అయినా ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందే. అలా కాకుండా ఎయిదర్ ఆర్ సర్వైవర్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ఆ అవసరం రాదు.
కుటుంబంలోని వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి పేరు గల బ్యాంక్ ఖాతా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.. అలా చేయొచ్చు అనుకుంటే పొరపాటు చేసిన వారవుతారు. చట్టపరంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనిపై నామినీలు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.