L&T AM Naik | లార్సెన్ అండ్ టర్బో (ఎల్ &టీ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వైదొలగాలని సంస్థ ఆర్కిటెక్ అనిల్ మణిభాయి నాయక్ (ఎఎం నాయక్) నిర్ణయించారు. సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వచ్చే సెప్టెంబర్ 30న ఎఎం నాయక్ వైదలుగుతారు. 2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎల్ అండ్ టీ గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు బుధవారం జరిగిన ఎల్ అండ్ టీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సంస్థ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఇక నుంచి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా వ్యవహరిస్తారు.
దేశంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ కంపెనీల్లో ఎల్ అండ్ టీ ఒకటి. అందులో జూనియర్ ఇంజినీర్గా 1965లో చేరారు. నాటి నుంచి శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ.. ప్రమోషన్లతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. జూనియర్ ఇంజినీర్ నుంచి జనరల్ మేనేజర్.. అటుపై మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవోగా పని చేశారు. 2003 డిసెంబర్ 29న ఎల్ అండ్ టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నియమితులయ్యారు. 2012-17 మధ్య ఎల్ అండ్ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. 2017 అక్టోబర్లో ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో గ్రూప్ చైర్మన్గా నియమితులయ్యారు.
58 ఏండ్లకు పైగా ఎల్ అండ్ టీతో అనుబంధం గల ఏఎం నాయక్ను బోర్డు అభినందనల్లో ముంచెత్తింది. సంస్థ అభివృద్ధికి అసమాన సహకారం అందించిన ఏఎం నాయక్ కృషి ఎనలేనిదని అభిప్రాయ పడింది. వివిధ రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రపంచంలోనే పేరొందిన సంస్థల గ్రూప్గా ఎల్ అండ్ టీని తీర్చిదిద్దారని కొనియాడింది.
`ఎల్ అండ్ టీ నా జీవితం. సంస్థ పురోగతిలో గణనీయ పాత్ర పోషించినందుకు నేను గర్వ పడతారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా శ్రేష్టమైన కంపెనీగా రూపుదిద్దుకున్నది` అని ఏఎం నాయక్ అభిప్రాయ పడ్డారు. ఏఎం నాయక్ సారధ్యంలో ఎల్ అండ్ టీ.. డిజైన్, డెవలప్మెంట్, క్షిపణుల తయారీ, అయుధ వ్యవస్థల తయారీ, జాతీయ సంస్థల నుంచి రక్షణ పరిశోధన వరకు విలువైన భాగస్వామ్యం కలిగి ఉంది.