I-Phone14 | భారత్లోనూ ఆపిల్ ఐ-ఫోన్ 14 ఉత్పత్తి ప్రారంభం కానున్నది. అయితే, కొన్ని వార్తా సంస్థల్లో వచ్చిన కథనాల ప్రకారం వచ్చేనెల ప్రారంభంలో భారత మార్కెట్లో ఐ-ఫోన్14 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. భారత్లో ఐ-ఫోన్ల ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విడి భాగాల సరఫరా దారులతో ఆపిల్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. వచ్చే దీపావళి నుంచి అంటే అక్టోబర్ 24 నుంచి భారత్లో ఐ-పోన్ 14 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభం కానున్నది.
ఇంతకుముందు ఐ-ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత వినియోగదారుల దరి చేర్చడానికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల సమయం పట్టేది. కానీ ఈ దఫా గడువు తగ్గించడానికి ఆపిల్ ప్రయత్నాలు సాగిస్తున్నది. తైవాన్ అంశంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు, భారత్తో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇండియాలోనూ ఐఫోన్-14 సిరీస్ ఫోన్ల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆపిల్ నిర్ణయించినట్లు సమాచారం. చైనాలో పూర్తిగా ఫోన్ల తయారీ నిలిపివేయడం లేదని తెలిపింది.
ఐ-ఫోన్ల ఉత్పత్తిదారు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఆధ్వర్యంలో భారత్లోని చెన్నై యూనిట్లో తయారు చేస్తున్నారు. చెన్నై యూనిట్లో అసెంబ్లింగ్కు కాంపొనెంట్ల సరఫరా ప్రక్రియపై ఆపిల్తోపాటు ఫాక్స్కాన్ సంస్థ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై స్పందించడానికి ఆపిల్, ఫాక్స్కాన్ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు.