న్యూఢిల్లీ, అక్టోబర్ 3: అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎంఎస్ఎల్).. రాష్ట్రంలో రూ.150 కోట్ల పెట్టుబడితో ఓ రక్షణ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నది. హైదరాబాద్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రతిపాదిత ప్లాంట్ను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏఎంఎస్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘హైదరాబాద్లోని హార్డ్వేర్ పార్క్లో మా స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని తేవాలని ప్రతిపాదించాం.
దీనిపై దాదాపు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం’ అని సదరు ప్రకటనలో కంపెనీ పేర్కొన్నది. కాగా, ఈ ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తిచేయాలని సంస్థ భావిస్తున్నది. అపోలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఇటీవలే ఏఎంఎస్ఎల్ మొదలైంది. రక్షణ పరికరాల తయారీకి దీన్ని ప్రారంభించారు. దేశీయంగా మౌలిక, రవాణా, విమానయాన తదితర రంగాల అవసరాల నిమిత్తం కటింగ్-ఎడ్జ్ డిఫెన్స్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇది పనిచేయనున్నది. ఇప్పటికే డీఆర్డీవోతో కీలక ఒప్పందాలను చేసుకున్నట్టు ఏఎంఎస్ఎల్ వ్యవస్థాపక ఎండీ బద్దం కరుణాకర్రెడ్డి తెలిపారు.