న్యూఢిల్లీ : టెక్ పరిశ్రమ ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుండగా పలు దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. మెటా, అమెజాన్, ట్విట్టర్ వంటి బడా కంపెనీలు మాస్ లేఆఫ్స్కు తెగబడగా తాజాగా నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో లేఆఫ్స్కు తెరతీసింది.
సిస్కో 4000 మంది ఉద్యోగులను సాగనంపే ప్రక్రియను ప్రారంభించిందనే వార్తలు టెకీల్లో కలకలం రేపింది. సిస్కోలో లేఆఫ్స్కు సంబంధించి నెల కిందటే వార్తలు రాగా, కంపెనీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను తాజాగా ముమ్మరం చేసినట్టు సమాచారం. రీబ్యాలెన్సింగ్లో భాగంగా కొన్ని వ్యాపారాల దిద్దుబాటు క్రమంలో లేఆఫ్స్ చేపట్టినట్టు సిస్కో తెలిపిందని ఓ వాణిజ్య పత్రిక తెలిపింది.
లేఆఫ్స్పై సిస్కో నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని తాము తేలికగా తీసుకోలేదని, బాధిత ఉద్యోగులకు సరైన పరిహార ప్యాకేజ్లతో పాటు అవసరమైన భరోసా ఇస్తామని పేర్కొంది.
మరోవైపు సిస్కో లేఆఫ్స్ బాధితులు దిలేఆఫ్స్.కాం, బ్లైండ్ పోర్టల్లో కంపెనీలో కొలువుల కోతపై రాసుకొచ్చినట్టు సిలికాన్వ్యాలీ బిజినెస్ జర్నల్ పేర్కొంది. తమకు వేరే కంపెనీల్లో జాబ్ల కోసం రిఫర్ చేయాలని వారు ఆయా వేదికలపై అభ్యర్ధించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా సిస్కో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.