AP Govt Shock to Adani | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దిగుమతి బొగ్గు సరఫరా చేసేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ దాఖలు చేసిన రెండు వేర్వేరు టెండర్లను ఏపీ సర్కార్ రద్దు చేసింది. బిడ్లలో అదానీ ఎంటర్ ప్రైజెస్ పేర్కొన్న ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇద్దరు ఏపీ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అధిక ధరల పేరిట దిగుమతి బొగ్గు సరఫరా కోసం దాఖలు చేసిన బిడ్లను ఒక రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఈ టెండర్ల రద్దుకు సంబంధించిన వివరాలు ఇంతకుముందు వెల్లడి కాలేదు.
సౌతాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న ఐదు లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి దేశంలోనే అతిపెద్ద బొగ్గు విక్రయ సంస్థ అదానీ ఆఫర్ చేసింది. టన్నుకు రూ.40 వేలు (526.50 డాలర్లు) చొప్పున ధర కోట్ చేసింది. గత జనవరిలో రూ.17,480 (230.08 డాలర్లు)లకు మరో 7.5 లక్షల టన్నుల సరఫరాకు అదానీ గ్రూప్ బిడ్ చేసింది.
ఐదు లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి అదానీ గ్రూప్ మాత్రమే టెండర్ దాఖలు చేసింది. 7.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి అదానీ గ్రూప్తోపాటు అగర్వాల్ కోల్ కూడా బిడ్ వేసింది. ఈ రెండు సంస్థలు అధిక ధరలు కోట్ చేశాయని ఏపీ అధికారులు చెప్పారు. దీనిపై స్పందించడానికి అదానీ, అగర్వాల్ కోల్ సంస్థలు అందుబాటులోకి రాలేదు.