న్యూఢిల్లీ: ఆనంద్ మహీంద్రా.. పరిచయం అక్కర్లేని పేరు.. వివిధ పారిశ్రామిక కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆయన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్. వచ్చే నవంబర్ నుంచి సంస్థ చైర్మన్గా వైదొలగనున్నారు. అటుపై నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఆయన ఈ చర్య తీసుకున్నారు.
స్టాక్మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ పాలన మెరుగు పరిచే లక్ష్యంతో సెబీ నిబంధనలను సరళతరం చేసింది.
అందులో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా టాప్ -500 లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విధులను విభజించింది.
తొలుత ఈ నిబంధనను అమలు చేసేందుకు గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీని నిర్ణయించారు. కానీ దాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్కు పొడిగించింది సెబీ.
సెబీ మార్గదర్శకాల ప్రకారం టాప్-500 లిస్టెడ్ కంపెనీల్లో చైర్మన్ లేదా చైర్పర్సన్ను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పరిగణిస్తారు. వీరికి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో విధుల్లో పాల్గొనే అవకాశం ఉండదు.
గడువు పొడిగించడంతో వచ్చే నవంబర్ 11 వరకు సంస్థ చైర్మన్గా కొనసాగాలని ఆనంద్ మహీంద్రాను కోరుతూ సంస్థ వార్షిక సమావేశం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
గత ఏప్రిల్లో అప్పటి ఎండీ పవన్ గోయెంకా రిటైర్ కావడంతో అనీశ్ షా.. మహీంద్రా గ్రూప్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇక చైర్మన్గా ఎవరు నియమితులు అవుతారో చూడాలి మరి.