Anand Mahindra | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అభివ్రుద్ధి దిశగా చేసే ప్రకటనలకు బడ్జెట్ మాత్రమే కాదు. ఏడాది పొడవునా ఎప్పుడైనా సందర్భానుసారంగా అవసరమైన ప్రకటనలు చేయొచ్చు. ఆర్థిక అవసరాలకనుగుణంగా ప్రణాళిక వేసుకునేందుకే బడ్జెట్ ఓ చాన్స్ కల్పిస్తుంది. ఎప్పటి నుంచో నేనూ ఇదే విషయం చెబుతున్నా’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2024-25 సంవత్సర మధ్యంతర బడ్జెట్ తనకు ఎంతో నచ్చిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రకటనలు చేయడం ప్రశంసనీయం అని తెలిపారు. ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలు ఏమీ లేకపోవడం హర్షణీయం అని కొనియాడారు. ‘పన్నులు, సుంకాలు యధాతథంగా కొనసాగించారు. వ్యాపారులు ఇటువంటి స్థిరత్వాన్ని కోరుకుంటారు. ట్యాక్స్- జీడీపీ నిష్పత్తి అధికంగా ఉంది. ఇది దేశానికి ఆర్థిక స్థిరత్వం అందించడంతోపాటు అవసరమైనప్పుడు నిధుల లభ్యతనూ పెంచుతుంది’ అని పేర్కొన్నారు.