Hyderabad | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): మార్గాలన్నీ రోమ్కే దారితీస్తాయి అనేది యూరప్లో మధ్యయుగాలనాటి నానుడి. ‘పరిశ్రమలన్నీ హైదరాబాద్కే వెళ్తాయి’ అనేది నేటి వాస్తవంగా మారింది. ప్రపంచంలోని ఏ దిగ్గజ సంస్థ అయినా సరే భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే తిరుగులేని ఆప్షన్ హైదరాబాద్. ఈ వాస్తవం ఇప్పటికే నిరూపణ అయ్యింది. నిత్యం అనేకమంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ విజయాల గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి హైదరాబాద్లోని పారిశ్రామిక ప్రభంజనంపై సోషల్మీడియాలో ప్రశంసలు కురిపించారు.
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణం ప్రారంభాన్ని పురస్కరించుకొని ఆయన స్పందించారు. ఇది కేవలం ఒక కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన వార్త మాత్రమే కాదని, గూగుల్ వంటి ఒక ప్రపంచ దిగ్గజ సంస్థ తమ అతిపెద్ద కార్యాలయ భవనాన్ని అమెరికా వెలుపల నిర్మించడం, దీనికోసం భారత్ను ఎంచుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించారు. భవన నిర్మాణం ప్రారంభ వీడియోపై ఎక్స్ (ట్విట్టర్) లో తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇది కేవలం వాణిజ్య వార్త కాదని, భౌగోళిక రాజకీయ ప్రకటన అని అన్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ను ఎంచుకుంటున్నాయని, ఇది మన దేశ ప్రతిష్ఠ, భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
గూగుల్ సంస్థ భారతలో తన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పటికే హైదరాబాద్లో ఏర్పాటుచేసింది. దానికి అదనంగా ఆ సంస్థ ప్రపంచంలోనే తమ ద్వితీయ అతిపెద్ద కార్యాలయ నిర్మాణాన్ని ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభించింది. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్లో నిర్మిస్తున్న కార్యాలయం ఆ కంపెనీకి అతిపెద్దది కావడం విశేషం. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మూడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2026 నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్ బిల్డింగ్ విధానంలో, అత్యాధునిక నిర్మాణ పద్ధతులతో దీన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ నగరం ఐరోపా, ఆగ్నేయా ఆసియా దేశాల్లోని ముఖ్యమైన మెట్రో నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చెందిందని ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, మ్యూజిక్ కంపోజర్, ఐఏఎఫ్ బిజినెస్ లీడర్షిప్ అవార్డు గ్రహీత మైఖేల్ మఖల్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రశంసించారు. 2002లో వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడినట్లు, గడిచిన ఎనిమిదేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నదని, ఇక్కడి అభివృద్ధి నమ్మశక్యంగా లేదని ఆయన పేర్కొన్నారు. తాను చాలాసార్లు ఐరోపా, ఆగ్నేయా దేశాలకు వెళ్లినట్లు, హైదరాబాద్ నగరం అక్కడి ప్రధాన మెట్రో నగరాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగితే సమీప భవిష్యత్తులో ఆయా దేశాల మెట్రో నగరాలను వెనక్కు నెట్టి హైదరాబాద్ మరింత ముందుకు పోతుందనే భావన కలుగుతుందన్నారు.