న్యూఢిల్లీ, మార్చి 23: బీమా పాలసీల క్రయవిక్రయాలతోపాటు ఇతరత్రా సేవలు, క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం ఓ సరికొత్త వేదిక అందుబాటులోకి వస్తున్నది. తాజాగా జరిగిన తమ 125వ బోర్డు సమావేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్కు వీలుగా ఓ ఈ-కామర్స్ వేదికకు లైన్క్లియరైంది. బీమా సుగమ్ పేరిట వస్తున్న దీనికి ఐఆర్డీఏఐ ఆమోదముద్ర వేసింది. ఐఆర్డీఏఐ రెగ్యులేషన్స్ 2024తో మరో ఏడు ఇతర రెగ్యులేషన్లకూ బీమా రంగ రెగ్యులేటర్ ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపింది.
ఇదో ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ వేదిక. పాలసీదారులు, బీమా సంస్థలు, మధ్యవర్తులు, ఏజెంట్లు ఇలా అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ బీమా సుగమ్ను తీర్చిదిద్దారు. పాలసీదారులు ఇక్కడ బీమాలను కొనేటప్పుడు అనేక రకాలుగా విశ్లేషించి, ఇతర ప్రత్యామ్నాయాలతో పోల్చిచూసుకునే సౌలభ్యం ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇలా అన్ని విభాగాల్లోగల ఇన్సూరెన్స్లను ఇక్కడ అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. సులభంగా వాటి సెటిల్మెంట్లనూ చేసుకోవచ్చు. ‘దేశీయ బీమా రంగంలోని అన్ని పనులూ ఇక్కడ అత్యంత ప్రభావవంతంగా, పారదర్శకంగా జరుగుతాయి’ అని ఐఆర్డీఏఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక పాలసీదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్న ఐఆర్డీఏఐ.. సరసమైన ధరలకు పాలసీలు లభిస్తాయని, 2047కల్లా దేశంలోని అందరికీ బీమా సదుపాయాన్ని అందించాలనే కల కూడా తీరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
ప్రస్తుతం భౌతిక మార్కెట్లో సంప్రదాయబద్ధంగా ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా కొనే పాలసీల కోసం అనేక రకాల పేపర్లను నింపి, మరెన్నో ధ్రువపత్రాలను జతచేసి సమర్పించాల్సిన అవసరం పాలసీదారులకు ఉంటున్నది. అయితే సుదీర్ఘ పనికి ఈ-ఫార్మాట్ ఇన్సూరెన్స్ చెక్ పెడుతుందని అంటున్నారు. పాలసీ రెన్యువల్స్ లేదా క్లెయిమ్ సమయంలో భౌతిక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో సులభంగా మీ చేతికి పాలసీని అందించడమే బీమా సుగమ్ లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘ద్రవ్య వ్యవస్థలో యూపీఐ ఎంతటి సంచలన మార్పులను తెచ్చిందో.. బీమా రంగంలోనూ బీమా సుగమ్ అంతే సంచలనం’ అని ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.