Amazon India | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తొలగింపు ప్రక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ఇండియాలో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 1,000 మంది ఉద్యోగాల పోతాయని తెలుస్తోంది. అంటే 1శాతం ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండబోతోందని సమాచారం.
కాగా, కొవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగులను నియమించుకొన్నామని, అనిశ్చిత పరిస్థితుల కారణంగా వారిని తొలగిస్తున్నామని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. అమెజాన్ స్టోర్స్, పీఎక్స్టీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రముఖ టెక్ కంపెనీ ‘సేల్స్ఫోర్స్’ కూడా అమెజాన్ బాటలోనే నడుస్తున్నది. ఈ ఏడాది తమ కంపెనీలోని 8 వేల మందిని (10శాతం) ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని కార్యాలయాలను కూడా మూసివేస్తున్నట్టు తెలిపింది.