హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను రోడ్డునపడేస్తున్నాయి. గ్లోబల్ సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ-కామర్స్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం సాకుతో ఎడాపెడా ఉద్యోగ కోతలకు దిగుతున్నాయి. మెటా(ఫేస్బుక్), ట్విట్టర్, స్నాప్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రధాన సంస్థలు తమ ఉద్యోగులను తగ్గిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటనలు కూడా చేసేశాయి మరి. గత వారం ట్విట్టర్ తన హెడ్ కౌంట్ను సగానికి తగ్గించగా, ఆ తర్వాత మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అమెజాన్ కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తీసేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇలా ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటామని వరుస ప్రకటనలు చేస్తుండటం అటు జాబ్ మార్కెట్లో, ఇటు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదలవుతున్న మ్యాందం ప్రభావం ఉద్యోగులపై పడుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా కార్పొరేట్లు నిధులను సమీకరించలేక పోతున్నారని, అందుకే కంపెనీలకు ఉద్యోగుల తొలగింపే మార్గంగా కనిపిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. అయితే పరిస్థితులు చక్కబడితే మళ్లీ నియామకాలు జరుగవచ్చంటున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ పెరగడంతో ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు ఒక్కసారిగా ఊపందుకున్నా యి. ఎక్కువ జీతాలతో యాజమాన్యాలు కొలువుల్లోకి తీసుకున్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న మాంద్యం పరిస్థితులు ఇప్పుడు వీటినీ ఉద్యోగుల తొలగింపు దిశగా నడిపిస్తున్నాయి. దీంతో ఐటీ రంగ ఉద్యోగుల్లోనూ భయాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే మూన్లైటింగ్ కారణంగా ఉద్యోగులపై గుర్రుగా ఉన్న సంస్థలు.. వ్యయ నియంత్రణ పేరుతో భారీగానే వేటు వేసేలా కనిపిస్తున్నాయి.
‘ప్రధాన టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో అనిశ్చితిని ఎదురొంటున్నవారు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. తమ బలాలు, బలహీనతలు, అవకాశాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా కొత్తకొత్త నైపుణ్యాలను ఒడిసి పట్టుకుంటే ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదు’ అని అమెరికన్ ఐటీ కంపెనీలో ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్గా విధులు నిర్వహిస్తున్న ఎంబి రాజు తెలిపారు. కంపెనీలు ఉద్యోగ కోతలను ప్రకటించడం కొన్నిసార్లు అనివార్యమవుతుందని, ఆ విషయాన్ని ఉద్యోగులు గుర్తించి, అందుకు సిద్ధపడే ఉండాలని సూచించారు.