న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సబ్సిడరీ అమెజాన్ పే భారత్లో వెల్త్ మేనేజ్మెంట్ సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. దేశంలో తన 5 కోట్ల మంది కస్టమర్లకు వెల్త్ మేనేజ్మెంట్ సేవలు అందించేందుకు పెట్టుబడుల సలహా సేవల స్టార్టప్ కువేరతో అమెజాన్ పే ఒప్పందం చేసుకుంది. మరోవైపు గూగుల్ పే తన బ్యాంకింగ్ భాగస్వామి ద్వారా తన కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్న తరహాలో అమెజాన్ పే ఈ దిశగా అడుగులు వేస్తోంది.
రెండు ప్రపంచస్ధాయి దిగ్గజ సంస్ధల కార్యాచరణతో భారత ఆర్థిక సేవల రంగం ముఖచిత్రం మారుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వెల్త్ మేనేజ్మెంట్ సేవల సన్నాహాల్లో భాగంగా 2017లో ఏర్పాటైన సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కువేరతో అమెజాన్ పే చేతులు కలిపింది. తొలుత మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీల్లో పెట్టుబడులకు కువేర వెసులుబాటు కల్పిస్తుందని కంపెనీ వ్యవస్ధాపక సీఈవో గౌరవ్ రస్తోగి తెలిపారు. అమెజాన్ పేతో ఇదే తమ తొలి వెల్త్ మేనేజ్మెంట్ టై అప్ అని ఆయన పేర్కొన్నారు.
తొలుత అమెజాన్ పేలో లాగిన అయిన యూజర్ స్క్రీన్పై వెల్త్ మేనేజ్మెంట్ ఐకాన్ను క్లిక్ చేయగానే కువేరా ప్లాట్ఫాంకు రీడైరెక్ట్ చేస్తుందని చెప్పారు. తమ కస్టమర్ల వెల్త్, పెట్టుబడుల అవసరాల కోసం కువేరా తమ వినూత్న ఆఫరింగ్తో మెరుగైన సేవలు అందిస్తుందని తాము భావిస్తున్నామని అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ వికాస్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కస్టమర్ల చెల్లింపులు, ఆర్ధిక అవసరాలను తీరుస్తూ జీవితాలను సరళతరం చేయాలన్నదే తమ ఆకాంక్షని పేర్కొన్నారు.