న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు, రాబడి పడిపోతుండటంతో మాస్ లేఆఫ్స్కు తెగబడిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఖర్చులకు కళ్లెం వేసేందుకు కొన్ని కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దాదాపు 16 నెలల కిందట కొనుగోలు చేసి కాలిఫోర్నియాలో ఖాళీగా పడిఉన్న కార్యాలయాన్ని అమెజాన్ విక్రయిస్తోందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ తెలిపింది.
ఈ కార్యాలయం విక్రయం దిశగా చర్చలు తుదిదశలో ఉన్నాయని సమాచారం. వ్యాపార అవసరాలను అందుకునే క్రమంలో మెట్రో కార్పొరేట్ సెంటర్ స్ధలాన్ని విక్రయించే ప్రక్రియ చేపట్టామని అమెజాన్ ప్రతినిధి స్టీవ్ కెల్లీ పేర్కొన్నారు. మరోవైపు 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన ఈకామర్స్ దిగ్గజం ఆ దిశగా కొలువుల కోత ప్రక్రియను ముమ్మరం చేసింది.
దశలవారీగా పెద్దసంఖ్యలో ఉద్యోగులను సాగనంపుతోంది. అమెజాన్లో మార్చి నుంచి ఉద్యోగుల ఉద్వాసన ఊపందుకోనుంది. భారత్లోనూ పలువురు అమెజాన్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్ధిక మాంద్యం భయాలతో ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, మెటా వంటి టెక్ దిగ్గజాలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.