Festive Sales | గతంతో పోలిస్తే ప్రస్తుత ఫెస్టివ్ సీజన్ సేల్స్ బెస్ట్గా నిలుస్తాయని ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఇండియా తెలిపింది. తమ ఆఫర్లకు వినియోగదారుల నుంచి మంచి గిరాకీ లభించిందని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్లైన్ సేల్స్లో 18-20 శాతం వృద్ధిరేటుతో రూ.90 వేల కోట్ల సేల్స్ నమోదవుతాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటర్జీ కన్సల్టెంట్స్ పేర్కొంది. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో తొలి నాలుగు రోజుల్లో 16 శాతం గ్రోత్తో రూ.29 వేల కోట్ల విలువైన విక్రయాలు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పని చేస్తున్న ఈ-కామర్స్ నెట్వర్క్.. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) సైతం రిటైల్ ఆర్డర్లలో కొత్త రికార్డు నమోదు చేసిందని రెడ్సీర్ తెలిపింది. అత్యధికంగా ఫుడ్, శీతల పానీయాలు, గ్రాసరీ వస్తువుల కోసం ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని వివరించింది.
ప్రతి పారా మీటర్లోనూ ఫెస్టివ్ సేల్స్లో ఈ ఏడాది విక్రయాలే బెస్ట్ అని అమెజాన్ డైరెక్టర్ నిశాంత్ శర్దానా చెప్పారు. కోవిడ్ అనంతర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గినట్లు ఎటువంటి సంకేతాలు లేవన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ద్వితీయ, తృతీయ, నాలుగవ శ్రేణి పట్టణ ప్రాంతాల్లో అమెజాన్ ఆర్డర్లు 80 శాతం పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ మరో నాలుగు రోజుల్లో ముగియనున్నదని చెప్పారు.
ఫెస్టివల్ సీజన్ విక్రయాల సందర్భంగా ముంబైతోపాటు ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, చెన్నై నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయి. లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని అమెజాన్ ఇండియా డైరెక్టర్ తోట కిశోర్ తెలిపారు.